గమ్యస్థానాలకు చేరుకునేలోపే... | - | Sakshi
Sakshi News home page

గమ్యస్థానాలకు చేరుకునేలోపే...

Mar 12 2026 7:17 AM | Updated on Mar 12 2026 7:17 AM

రామభద్రపురం: ఉద్యోగ విధుల కోసం కొందరు... ఆస్పత్రులు, బంధువుల ఇళ్లకు వెళ్లేవారు మరికొందరు.. వివిధ పనులు, వ్యాపారాల కోసం వెళ్లేవారు ఇంకొందరు... ఇలా 60 మంది ప్రయాణికులతో పార్వతీపురం నుంచి సాలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రామభద్రపురం పెట్రోల్‌బంకు మలుపు వద్ద బుధవారం ఉదయం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఉలిక్కిపడ్డారు. తేరుకునేలోపే ఒకరిపై ఒకరు పడిపోయి క్షత్రగాత్రులుగా మారారు. హాహాకారాలు చేశారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి బస్సులో ఉన్న 60 మందిలో 10 నుంచి 15 మంది మినహా మిగిలిన వారిలో కొందరు తీవ్రగాయాలు, మరికొందరు స్వల్పగాయాలతో చెల్లాచెదురుగా పడి ఉన్నారు. వీరిని స్థానిక యువకులు కిందకు దించారు. పోలీసులు, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ వి.ప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు 108 వాహనాలు, పోలీస్‌ జీపులో క్షత్రగాత్రులను బాడంగి, బొబ్బిలి సీహెచ్‌సీలకు, రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

● సీసీ కెమోరాలు పరిశీలించిన పోలీసులు..

రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న సీసీ కెమోరాలను పోలీసులు పరిశీలించారు. అందులో బస్సు డ్రైవర్‌ ఇయర్‌ ఫోన్స్‌ను చెవిలో పెట్టుకుని నిర్లక్ష్యంగా బస్సును అతివేగంగా నడుపుతూ లారీని ఢీకొట్టి ప్రమాదానికి కారకుడయ్యాడని గుర్తించారు. పార్వతీపురం డిపోలో 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరడం... ఆ సమయాన్ని కలిపేందుకు అతివేగంగా బస్సు నడిపినట్టు ప్రాథమికంగా గుర్తించారు. డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌పై గతంలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదు లు అందడంతో సాలూరు డిపో పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్‌ను పార్వతీపురం డిపోకు బదిలీచేసినట్టు సమాచారం. బస్సు డ్రైవర్‌ పాలకొండ తిరుపతిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి.ప్రసాదరావు తెలిపారు.

● తీవ్రగాయాలపాలై...

కొట్టక్కి సచివాలయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బొబ్బిలికి చెందిన మాసాబత్తుల ఝాన్సీ, శనగల సూర్యనారాయణమ్మ, రామభద్రపురం గ్రామానికి చెందిన దేవతన లక్ష్మి, చిన బూర్జవలసకు చెందిన గేదెల దాడమ్మ, గొర్లి రాజేశ్వరమ్మ, ఇజ్జాడ గౌరమ్మ, గొడ్డె చిన్నయ్య, పారాది నాగరాజు తదితరులను మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్ప్రత్రికి తరలించారు. యజ్జల లక్ష్మమ్మ, బూరాడ గౌరమ్మ, సాలూరు మున్సిపల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్‌.శోభారాణి, బస్సు కండక్టర్‌ బెహరా చిన్నమ్మ తదితరులు బాడంగి సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలైన ఎస్‌ఎంబి మైలాలి, మత్స దివ్య, సీహెచ్‌ రాజీవ్‌, కర్రి కాంతారావు, పాలవలస శ్రీనివాసపరావు, కర్రి పద్మ, పైల భారతి, శిరిపురపు భారతి, నక్కేళ్ల అమరామణి, నక్కేళ్ల భారతి తదితరులు బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు పొందుతున్నారు.

డిపో నుంచి పది నిమిషాలు

ఆలస్యంగా బయలుదేరిన బస్సు

ఆ సమయాన్ని కలిపేందుకు

అతివేగంగా బస్సును నడిపిన డ్రైవర్‌

రోడ్డు మలుపులో లారీని ఢీకొట్టిన బస్సు

బస్సులోని 60 మందిలో

50 మందికి గాయాలు

సాయం కోసం ప్రయాణికుల

ఆర్తనాదాలు

9 మందిని జిల్లా కేంద్రాస్పత్రికి

తరలింపు

మిగిలిన వారికి బాడంగి, రామభద్రపురం ఆస్పత్రుల్లో చికిత్స

బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు

బస్సులో అధికమంది రామభద్రపురం, తారాపురం, కొట్టక్కి, సాలూరు తదితర గ్రామాల స్టాప్‌లలో దిగాల్సినవారే అధికం. కొద్ది సమయంలో గమ్యస్థానాలకు చేరుకుంటామన్న సమయంలో బొబ్బిలి వైపు వెళ్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన లారీని బస్సు ఢీకొట్టడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. గాయపడిన వారిలో 20 మంది వరకు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. తల, గుండె, వీపు, కడుపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. మరో 25 మందికి పెదవులు, ముక్కు, నాలుక, దంతాల వద్ద గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement