
గణేష్ మంటపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి
● ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం క్రైమ్: రానున్న వినాయక చవితి సందర్భంగా గణేష్ మంటపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం స్పష్టం చేశారు. అలాగే మంటపాల ఏర్పాటుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించబోయే వ్యక్తులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సింగిల్ విండో విధానంలో జ్ట్టి ఞట://జ్చ ుఽ్ఛటజి ఠ్టట్చఠి. ుఽ్ఛ్ట క్లిక్ చేసి, నిర్దేశించిన అనుమతులు పొందాలని సూచించారు. ఈ విధానం వల్ల సులభంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, మంటపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనానికి అనుమతులు పొందవచ్చునని ఎస్పీ తెలిపారు.
తెలుగు కీర్తి పురస్కారానికి గురుప్రసాద్ ఎంపిక
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు, జిల్లా కేంద్రానికి చెందిన రచయిత, తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట సేవా పురస్కార గ్రహీత సముద్రాల గురుప్రసాద్ తెలుగు కీర్తి పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్న తెలుగు భాషా దినోత్సవంలో ప్రతిష్టాత్మక తెలుగు కీర్తి పురస్కారం ఆయనకు ప్రదానం చేయనున్నారు.
పరుగు పందెంలో ప్రతిభ
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కుమరాం పాలవలసకు చెందిన క్రీడాకారుడు గదుల దుర్గారావు రాష్ట్రస్థాయి పరుగుపందెం పోటీల్లో ప్రతిభ చాటాడు. జిల్లా కేంద్రంలోని విజ్జి స్టేడియంలో జరిగిన 36వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జూనియర్ ఇంటర్ చాంపియన్షిప్ 2025 పోటీల్లో 5000 మీటర్ల పరుగు పందెంలో జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 9,10,11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 5000 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. ఈ క్రీడాకారుడిని ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం అభినందించారు. క్రీడల్లో మరింత ఆసక్తిని కనబరచాలని, క్రీడలు ఉన్నత స్థానంలో స్ధిరపడేలా ఎదుగుదలకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ కింతాడ కిరణ్కుమార్ పాల్గొన్నారు.
ఉత్తమ టీటీఐలకు సత్కారం
తాటిచెట్లపాలెం(విశాఖ): వాల్తేరు రైల్వే డివిజన్ టికెట్ తనిఖీ సిబ్బంది మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం సాధించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేరు డివిజన్ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధించిన సిబ్బందిని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా గురువారం సత్కరించారు. మే నెలలో టికెట్ తనిఖీ సిబ్బంది వివిధ రూపాలలో రూ.2,41,20,627 ఆదాయాన్ని ఆర్జించారు. గత సంవత్సరం మే నెలలో సాధించిన రూ. 2,27,34,221 ఆదాయంతో పోలిస్తే, ఈసారి అధిక ఆదాయాన్ని నమోదు చేశారు. ఈ రికార్డు ఆదాయం సాధించడంలో వ్యక్తిగతంగా ఇద్దరు ఉద్యోగులు అద్భుతమైన పనితీరు కనబరిచారు. విజయనగరం, టీటీఐ వై. అప్పలరాజు.. 836 కేసులు నమోదు చేసి రూ. 4,89,320 జరిమానాలు, అదనపు టికెట్ రుసుముగా వసూలు చేశారు. శ్రీకాకుళం రోడ్డు టీటీఐ కె. శ్రీనివాసరావు 815 కేసులు నమోదు చేసి రూ. 4,42,900 వసూలు చేశారు. వారిద్దరిని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ సమక్షంలో సత్కరించారు.

గణేష్ మంటపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి

గణేష్ మంటపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి