
వణికిస్తున్న వైరల్ జ్వరాలు
పాలకొండ రూరల్/గుమలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో కురుస్తున్న వర్షాల ప్రభా వంతో కొత్త నీరు సమకూరడంతో పాటు పారిశుధ్య లోపం, డ్రైనేజీల సమస్యలు, నిల్వ ఉండే మురుగు కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. జ్వరప్రభా వంతో తీవ్ర చలి, కీళ్ల నొప్పులు, ఆకలి లేకపోవడం, నోరు పూర్తిగా చేదుగా మారడంతో పాటు అఽధిక ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం కనీసం 4–6 రోజులు కొనసాగడంతో జ్వర పీడితులు పూర్తిగా రోగ నిరోధకశక్తిని కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు.
ఏజెన్సీ కలబోసి ఉన్న ప్రాంతంలో..
ఏజెన్సీ ప్రాంతం అధికంగా మిళితమై ఉన్న పాలకొండ, కురుపాం నియోజకవర్గాల పరిధిలో దాదాపు ప్రతి ఇంటా జర్వ పీడితులు ఇద్దరు లేక ముగ్గురు ఉంటున్నారు. గడిచిన 20 రోజుల వ్యవధిలో పాలకొండ ఏరియా ఆస్పత్రిలో 848 మంది వివిధ రకాల జ్వరాలతో చేరారు. 705 మందికి టైఫాయిడ్ పరీక్షలు చేయగా 141 మందికి పాజిటివ్ వచ్చింది, డెంగీ పరీక్షలు 193 మందికి చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చింది, 896 మందికి మలేరియా పరీక్షలు చేపట్టగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. దాదాపు 6 వందల మంది వైరల్, సాధారణ జ్వరాల బారిన పడినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఇన్పేషెంట్లుగా వందకుపైబడి బాధితులు చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. సగటున రోజుకు ఆరు వందల మేరకు ఓపీ నమోదవుతున్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. వారిలో అధిక శాతం జ్వరపీడితులే కావడం విశేషం.
చేతి సొమ్ము చెల్లించి..
సీజనల్ జ్వరపీడితులు రోగనిర్ధారణ పరీక్షలకు అధికమొత్తంలో చేతి సొమ్ము చెల్లిస్తున్నారు. సర్కారు దవాఖానాతో పోల్చుకుంటే రోగుల తాకిడి ప్రైవేట్ ల్యాబ్ల వద్ద అధికంగానే ఉంటోంది. గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు జ్వరాలపై నిరంతర సర్వే కొనసాగడంతో సీజనల్ జ్వరాలు అదుపులో ఉండేవని గ్రామీణులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అందించే మందులు కూడా ఆశించిన మేర అందుబాటులో ఉండడం లేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా బీపీ, గ్యాస్టిక్, రోగనిరోధక శక్తిని అందించే ఐవీ, డైక్లోఫినాక్ ఇంజెక్షన్లు తక్కువగా పీహెచ్సీలకు చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. నాలుగు నెలలకు ఓ సారి ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే మందుల్లో నిత్యావసర మందు బిళ్లలు, సూది మందులు తక్కువగా వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రోగగ్రస్తులు ప్రైవేట్ ల్యాబ్లు, ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మలేరియా, టైపాయిడ్, సీబీసీ, యూరిన్, ప్లేట్లెట్స్, వైరల్ జ్వర నిర్ధారణకు రు.600 చెల్లించాల్సి ఉంటుంది. డెంగీ, స్క్రాబ్ టైఫస్ వంటి ప్రాణాంతక జ్వరాల నిర్ధారణకు రూ.వెయ్యి వరకూ చెల్లించాల్సి వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంట్లో ఇద్దరు ముగ్గురికి జ్వరం వస్తే రూ.వేలల్లో చేతి సొమ్ము చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.
పారిశుధ్య లోపం..కలుషిత నీటి ప్రభావం..
జర్వరాల విజృంభణకు కలుషిత నీరు, పారిశుధ్య లోపమే ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. తాజాగా జిల్లాలో నమోదవుత్ను అధిక వర్షాల ప్రభావంతో నీటి వనరుల్లో కొత్తనీరు చేరుతోంది. ఎక్కిడికక్కడ మురుగు పేరకుపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి రెండు విడతలు, తాజాగా 16వ ఆర్ధిక సంఘానికి సంబంధించి ప్రస్తుత ఆగస్టు నెలలో విడుదల కావాల్సిన మొత్తాలు ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో బ్లీచింగ్, ఫినాయిల్ కొనేందుకు కూడా పంచాయతీల ఖాతాల్లో నిధులు లేవని ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. సొంత సొమ్ము చెల్లించి ఎంతోకొంత పనులు చేపడుతున్నా ఫలితం లేకపోతోందని అంటున్నారు.
ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు
రోజుల తరబడి తీవ్ర జ్వరంతో పాటు
కీళ్ల నొప్పులు
ఏజెన్సీ కలబోసిన రెండు నియోజకవర్గాల్లో మరింత ప్రభావం
తీవ్రమైన నొప్పులు
గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన నొప్పులతో కూడిన జ్వరాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏ ఇంట చూసినా చిన్నాపెద్దా తేడా లేకుండా జ్వరాలు వస్తున్నాయి. రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నాం. స్థానికంగా అందిన వైద్యానికి నయంకాకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. పి.సులోచన,
తాడికొండ, జీఎల్.పురం మండలం
జాగ్రత్తలు అవసరం
గతంతో పోల్చుకుంటే టైఫాయిడ్, మలేరియా కాకుండా వైరల్, సాధారణ జ్వరాలు నమోదువుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాచిచల్లార్చిన నీటిని తాగాలి. రోగ నిరోధక శక్తిని అందించే పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంతో మరింత జాగ్రత్తలు పాటించాలి. వర్షంతో తడవనీయ కూడదు. దుమ్ము ధూళిలో ఆటలాడనీయోద్దు. జలుబు, దగ్గు వస్తే అలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
డాక్టర్ రవికుమార్, ఏరియా ఆస్పత్రి, పాలకొండ

వణికిస్తున్న వైరల్ జ్వరాలు

వణికిస్తున్న వైరల్ జ్వరాలు

వణికిస్తున్న వైరల్ జ్వరాలు