రొంపిచర్ల: విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సబ్జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా బాలబాలికల జట్లు ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాలు సాధించాయని వ్యాయామ ఉపాధ్యాయుడు కె.సైదయ్య ఆదివారం తెలిపారు. బాలుర విభాగంలో గుంటూరు జట్టు రెండో స్థానంలో నిలవగా, విజయనగరం జిల్లా జట్టు ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. బాలికల విభాగంలో శ్రీకాకుళం జట్టు ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించాయని పేర్కొన్నారు. రెండు విభాగాల ఫైనల్ మ్యాచ్లకు భారీ వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్లు పూర్తిగా నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో లీగ్ మ్యాచ్లలో ఆయా జట్లు సాధించిన రన్న్ రేట్ను పరిగణనలోకి తీసుకుని న్యాయ నిర్ణీతలు స్థానాలను నిర్ణయించారు. పోటీల్లో రొంపిచర్లకు చెందిన క్రీడాకారులు వ్యక్తిగత ప్రతిభతో ఆకట్టుకున్నారని తెలిపారు. బాలికల విభాగంలో వెంగళరాజు శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి బెస్ట్ క్యాచర్గా ఎంపికయ్యారు. బాలుర విభాగంలో బొజ్జ వెంకట సాయికృష్ణ రాష్ట్రస్థాయి బెస్ట్ పిచ్చర్గా ఎంపికయ్యారు. వీరి ప్రతిభను నిర్వాహకులు అభినందించారు. పోటీల ముగింపు కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే.రంగారావు (బేబీ నాయన) ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలు, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల విజయంపై క్రీడాభిమానులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.


