నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అవసరమైన సౌకర్యాలను కల్పించి ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్ స్లోగన్తో ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్ మంగళవారం కాసు సెంట్రల్లో నిర్వహించారు. తొలుత శివశంకరరావు, మరో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాతో కలిసి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్పత్తి, మార్కెటింగ్, రుణ సౌకర్యాలు, డిజిటల్ ఆధారిత సేవల వినియోగం వంటి అంశాల మధ్య సమన్వయం సాధించేందుకు, సులభతరంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్నింటిని ఒకే వేదిక మీదకు తీసుకు వస్తున్నట్లుగా చెప్పారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన పరిశ్రమలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను పల్నాడు జిల్లా యంత్రాంగం అందిస్తుందని తెలియజేశారు. నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన వివిధ అంశాలపై పరిజ్ఞానం అందించేందుకు ప్రత్యేక సెమినార్లు, హెల్ప్ డెస్క్, స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిని ముఖ్యఅతిధులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. జిల్లా పరిశ్రమల అధికారి వెంకట సురేష్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ డాక్టర్ గుడిపూడి చిన్నరాజు, సీఈఓ విశ్వ మనోహర్ పాల్గొన్నారు.
ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు


