నరసరావుపేట: జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చిలకలూరిపేట పురుషోత్తంపట్నం జంక్షన్ వద్ద గత నెలలో జరిగిన ఆటో ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతిచెందడం, ఆరుగురు గాయపడిన సంఘటనపై ట్రాన్స్పోర్టు, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, పోలీస్ , చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల పరిస్థితి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, హాట్స్పాట్, బ్లాక్ స్పాట్ల వద్ద తీసుకుంటున్న చర్యలు, రహదారి భద్రత ప్రమాణాలపై సమీక్షించారు. చిలకలూరిపేట హైవేపై ఐదు హాట్ స్పాట్లు, నాలుగు బ్లాక్ హోల్స్ను గుర్తించినట్లు కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. పురుషోత్తం పట్నం జంక్షన్, ఎన్ఆర్టీ జంక్షన్ల వద్ద రోడ్లపై ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగించాలని, ట్రాఫిక్ డివైడర్ల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కూడా తొలగించాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి వాటిని తొలగించాల్సిందిగా చిలకలూరిపేట ఆర్డీవోని కలెక్టర్ ఆదేశించారు. పురుషోత్తంపట్నం, ఎన్ఆర్టీ, విజయ బ్యాంక్, ఏఎంజీ సెంటర్లు, బస్స్టాండుల వద్ద లైట్లు, సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పురుషోత్తంపట్నం యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. జిల్లా ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు సూచించిన
జిల్లా కలెక్టర్, అదనపు ఎస్పీ


