బెదిరింపులకు బెదరవద్దు.. ప్రలోభాలకు లొంగవద్దు ఎన్నికల్లో నిజాయితీగా పనిచేద్దామని పిలుపు వేధింపులు కొంతకాలమే.. కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఇప్పుడు పనిచేసిన నేతలకు జగనన్న 2.0లో పెద్దపీట పార్టీ శ్రేణులకు వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల దిశానిర్దేశం నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ హాజరైన పార్టీ నేతలు పీఆర్కే, డాక్టర్ గోపిరెడ్డి, విడదల రజని, నంబూరు, పూనూరి, నాగార్జున యాదవ్, డాక్టర్ గజ్జల
‘స్థానిక’ ఎన్నికలపై వైఎస్సార్ సీపీ సన్నాహాక సమావేశం
నరసరావుపేట: రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం కృషి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్యనాయకులు పిలుపునిచ్చారు. నరసరావుపేటలోని ఓ కల్యాణమండపంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు, జిల్లా, నియోజకవర్గాలకు చెందిన పలు విభాగాల నాయకులకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం పార్టీ నాయకుడు రేపాల శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతో ఎంపీగా గెలిచి, అనంతరం టీడీపీలో చేరి ఎంపీ అయిన వ్యక్తి తన పాత పరిచయాలతో ఫోన్లు చేసినా పట్టించుకోవద్దని కోరారు. నాయకులు, కార్యకర్తలు లైను దాటకుండా పార్టీ అఖండ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడారు.
పార్టీ వలంటరీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున యాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సినిమాలో ఇంటర్వెల్ ఫైట్గా భావించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అక్రమ కేసులో పీఆర్కే జైలులో ఉండగా చూసేందుకు వెళ్లిన తనను అరెస్టుచేసి జైలు పాలు చేశారన్నారు. అక్రమ కేసులతో ఇబ్బందులు పడిన పీఆర్కే, విడుదల రజిని, ఇతర నేతలకు పార్టీ అండగా నిలిచిందన్నారు. బీసీ మహిళ రజనిని పల్నాడు నాగమ్మగా భావించిన వెన్నుపోటు పార్టీ నాయకులు భయపడుతున్నారన్నారు.
సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని వెన్నుపోటు ప్రభుత్వం ప్రకటించిందని, ఇదో పెద్ద మోసం, దొంగ వాగ్దానం అన్నారు. గత ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో 80 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని, ఇప్పుడు ప్రతి ఒక్కరిని రూ.లక్ష కట్టమని అడుగుతున్నారని, అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చంద్రబాబు మాటలకు ఇదే అర్ధం అన్నారు. పేకాట క్లబ్పై తాను ఫిర్యాదుచేస్తే పట్టించుకోని పోలీసులు, అధికారులు ఆ క్లబ్పై మరో క్లబ్ నిర్వాహకులు దాడిచేసి ధ్వంసం చేస్తే మూడురోజుల్లో పట్టుకున్నారని, ప్రభుత్వ తీరు ఈవిధంగా ఉందన్నారు. గురజాల, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు పడాల శివారెడ్డి, బాసు లింగారెడ్డి మాట్లాడారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడితో పాటు జిల్లా పదవులు పొందిన వారందరికీ పార్టీ అందజేసిన గుర్తింపుకార్డులను నాయకులు అందజేశారు. పలు నియోజకవర్గాల పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, చిట్టా విజయభాస్కరరెడ్డి, యెనుముల మురళీధర్రెడ్డి, దొంతిరెడ్డి అంజిరెడ్డి, పార్టీ నాయకులు గుబ్బా చంద్రశేఖర్, టీజీవీ కృష్ణారెడ్డి, చింతా విజయభాస్కరరెడ్డి, జాలయ్య, ఈదా శ్రీనివాసరెడ్డి, జిల్లా, నియోజకవర్గాలకు చెందిన పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


