కలెక్టర్ కృతికా శుక్లా నేడు, రేపు పోలింగ్ కేంద్రాలలో బీఎల్ఓలు
నరసరావుపేట రూరల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలను ఈనెల 10వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఇప్పటికే సర్ ముసాదాను అగస్ట్ 31వ తేదీన విడుదల చేసినట్లు తెలిపారు. ముసాదా ఓటరు జాబితా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈనెల 5, 6 (శని, ఆదివారం) తేదీలను ప్రత్యేక ప్రచార దినాలుగా ప్రకటించి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాజకీయపార్టీల ప్రతినిధులు తమ బూత్ లెవల్ ఏజెంట్లను హాజరయ్యేలా చూసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు బీఎల్ఓల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువ ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నరసరావుపేట ఈస్ట్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని బరంపేటలోని ఇస్కాన్ ఆలయాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. శ్రీరాధా గోవిందులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.


