నాదెండ్ల: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించినందుకు గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్డాండర్డ్స్(ఎన్క్యూఏఎస్) సర్టిఫికెట్ దక్కింది. జూలై 28,30 తేదీల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తరఫున ఇరువురు సభ్యులు గణపవరం పీహెచ్సీని పరిశీలించారు. వివిధ అంశాల్లో మదింపు నిర్వహించారు. ఔట్పేషెంట్, ఇన్పేషెంట్ విభాగాలు, లేబర్ రూమ్, లేబొరేటరీ పరిశీలించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల నాణ్యత, మందుల లభ్యత, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, పరిపాలనా విధానాలు అధ్యయనం చేశారు. ఈ రిపోర్టు ఆధారంగా తాజాగా విడుదలైన జాబితాలో గణపవరం పీహెచ్సీ 90.24 శాతం స్కోరుతో ఎన్క్యూఏఎస్ సర్టిఫికెట్ మంజూరైంది. ఆసుపత్రికి ఏడాదికి రూ.3 లక్షల చొప్పున మూడేళ్ల పాటూ నిధులు అదనంగా అందనున్నాయి. ఈ నిధులను రోగుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు, నాణ్యత మెరుగుదలకు వెచ్చించనున్నారు. వైద్యులు, సిబ్బంది నాణ్యమైన సేవలందించటం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిరంతర మార్గదర్శకత్వంతో ఈ ఘనత సాధించినట్లు స్ధానిక వైద్యాధికారులు కవితాఅనసూయ, ప్రసాద్నాయక్ హర్షం వ్యక్తం చేశారు.


