దాచేపల్లి: టీడీపీ పాలనాలో అన్నదాతల బతుకులు కకావికలం అవుతున్నాయి. పంటలకు సాగునీరు అందకపోవటంతో ఎండిపోతోంది. ఇప్పటికే పత్తి దాదాపుగా ఎండిపోయే పరిస్థితుల్లో ఉంది. మిరప మొక్కలు కూడా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మేజర్ కాలువల్లో చుక్క సాగునీరు కూడా పారకపోవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగు చేస్తున్న పంటలను చూసి ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం పత్తి దిగుబడులతో కళకళలాడాల్సిన అన్నదాతల లోగిళ్లు వెలవెలబోతున్నాయి. వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉండాల్సిన కూలీలు పనులు లేక పస్తులుంటున్నారు. ఎటు చూసినా కరువు పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతన్నారు.
పత్తి చేలకు నీరందక...
నియోజకవర్గ వ్యాప్తంగా వేల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. మే నెల ముగింపు నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం పత్తి పంట నుంచి దిగుబడి వచ్చే సమయం ఇది. సాగునీరు ఇప్పటి వరకు అందకపోవటంతో చెట్టుకు కాసిన పూత, పిందెలు, ఆకులు రాలిపోతున్నాయి. కాయ నుంచి వచ్చిన పత్తి కూడా రంగుమారి రాలిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటకు తప్పనిసరిగా నీటి తడి వేయాల్సి ఉంది. నియోజకవర్గ పరిధిలోని తంగెడ, రామాపురం, ఆకురాజుపల్లి మేజర్ కాలువ నుంచి చుక్కనీరు పంటలకు అందని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసే పరిస్థితులు లేవని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టారు. వ్యవసాయ బోర్ల కింద సాగు చేస్తున్న పత్తి పంటకు నీటి తడి వేయాలన్నా భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్ల ద్వారా నీరు అందని పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి కరువు పరిస్థితులను చూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిరప పరిస్థితి అధ్వానం
మిర్చి పంట పరిస్థితి కూడా దాదాపుగా ఇదేవిధంగా ఉంది. వర్షాలు కురవకపోవటంతో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. వర్షం పడుతుందని ఆశతో కొంతమంది రైతులు మిరప సాగు చేశారు. సాగునీరు అందకపోవటంతో అవి కూడా ఎండిపోతున్నాయి. వర్షం కురిస్తే మిరప మొక్కలు నాటుదామని రైతులు నర్సీరీల్లో మొక్కలు పెంచుతున్నారు. వరుణుడి జాడ లేకపోవడంతో రైతులు మిరప మొక్కలు వేయకపోవటంతో నర్సీరీల్లో లక్షల్లో మొక్కలు నిల్వ ఉన్నాయి. రోజులు గడిచేకొద్దీ నర్సీరీల్లో మొక్కలు పెంచటం భారంగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. తీవ్ర వర్షభావ పరిస్థితులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇప్పటికే చాలావరకు
ఎండిపోతున్న పత్తి
పెట్టుబడి పెట్టిన రైతులకు ఆర్థికనష్టం
మిర్చి పంట పరిస్థితి
కూడా దాదాపు ఇదే..
నర్సరీల్లో నిరుపయోగంగా
లక్షల మొక్కలు
టీడీపీ సర్కారు తీరుపై
కర్షకుల ఆగ్రహం


