సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
చిలకలూరిపేట: ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మాటలకు అందని మహావిషాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వేలూరులో అశ్రునయనాల మధ్య జరిగిన అంతిమ సంస్కారాలకు హాజరై మృతులకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ తరఫున తక్షణ ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలు నిరుపేదలని, ప్రభుత్వం వెంటనే భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులతో ఫోన్లో ఈశ్వరయ్య కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ సైతం వేలూరులో మృతుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని, గ్రామ కార్యదర్శి ఎలికా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నరసరావుపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేలూరు గ్రామానికి చెందిన దళిత మహిళా వ్యవసాయ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండరోడ్డులోని విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొన్న ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నష్టపరిహారం ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ 10 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.


