జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్
ఈపూరు: ఊడిజర్ల ఎస్సీ కాలనీలో డెంగీ జ్వరాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పల్నాడు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ అన్నారు. ‘ఊడిజెర్లలో డెంగీ విజృంభణ’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు డీఎంహెచ్ఓ స్పందించారు. శుక్రవారం ఊడిజర్ల ఎస్సీ కాలనీలో పర్యటించి, వీధులు పరిశీలించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీ అధికారితో ఫోన్లో మాట్లాడి కాలనీలో మురుగు కాలువల పరిస్థితిని వివరించారు. ఇళ్ల ముందు నీటి నిల్వలు ఉండటాన్ని గుర్తించి కాలనీవాసులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వైద్య శిబిరాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డాక్టర్ రత్న మన్మోహన్ విలేకరులతో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కాలనీలో తరచూ డెంగీ కేసులు నమోదవుతున్నాయని మురుగుకాలువల అపరిశుభ్ర వాతావరణంతోనే దోమలు వ్యాపించి జ్వరాల బారిన పడుతున్నారన్నారు. వెంటనే కాలనీలో నీటి నిల్వలు, మురుగు తొలగింపు పనులు చేపట్టామన్నారు. బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ పనులు చేపట్టి రెండు రోజుల్లో కాలనీలో సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయనతోపాటు మలేరియా అధికారి, కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు.


