చిలకలూరిపేటటౌన్: వన్యప్రాణి ఆకస్మికంగా మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని కమ్మవారిపాలెం గ్రామ పరిధిలో ఉన్న పోలేరమ్మ గుడి ఎదురు గల పంట కాలువ పక్కన ఓ జింక అచేతనంగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోటప్పకొండ బీట్ ఆఫీసర్ కిరణ్ ఆధ్వర్యంలో సిబ్బంది వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం పశువైద్యులను రప్పించి, సంఘటనా స్థలంలోనే జింక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
అనారోగ్యమే కారణం..
జింక శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు, దాడి జరిగిన ఆనవాళ్లు కానీ లేవని, కేవలం తీవ్ర అనారోగ్య కారణాల వల్లే జింక మృతి చెందిందని పశువైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై కోటప్పకొండ బీట్ ఆఫీసర్ కిరణ్ మాట్లాడుతూ.. అటవీ సరిహద్దుల సమీపంలో లేదా గ్రామాల పరిసరాల్లో ఎక్కడైనా వన్యప్రాణులు గాయపడినా, మృతి చెందినా వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అరుదైన జీవులను, వన్యప్రాణులను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు.


