కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించిన జేఏసీ నాయకులు
నరసరావుపేట: విద్యుత్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే నిర్వహించాలని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి సంస్థను ప్రైవేటు పరంచేసే ఆలోచనను విరమించుకోవాలని ఆ సంస్థ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పల్నాడు జిల్లాలోని ఆరు డిపోల ఆర్టీసీ ఉద్యోగుల నుంచి సేకరించిన సంతకాలతో సోమవారం జేఏసీ జిల్లా నాయకులు, ఉద్యోగులు పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. జిల్లా నాయకులు జీటీ రావు, బి.నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు ఆపరేటర్లకు విద్యుత్ బస్సులు అప్పగించి ఒక కిలోమీటర్కు రూ.72.06లకు అనుమతించి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణ సంస్థ నిర్వహించటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మూడేళ్లుగా పీఆర్సీ కమిషనర్ నియమించలేదని, ఐఆర్, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇవ్వలేదన్నారు. కమిషనర్ను నియమించి ఐఆర్, డీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి పథకం వలన ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పథకం అమలు చేయకముందు 60 శాతం ఉండే ఆక్యుఫెన్సీ రేషియో ఇప్పుడు 90 శాతానికి చేరిందన్నారు. అవసరమైన ఉద్యోగులు, బస్సులు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గోదావరి పుష్కరాలు రానుండటంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తక్షణమే నాలుగు వేల కొత్త బస్సులు ప్రవేశ పెట్టాలని, ఖాళీగా ఉన్న 15 వేల మంది సిబ్బందిని నియమించాలని కోరారు. అమరావతి పల్నాడు జిల్లా జేఏసీ అద్యక్షులు ఎన్.నాగమల్లేశ్వరావు, ఎన్.మురారి, కె.రామారావు, నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి డిపోల నాయకులు పాల్గొన్నారు.


