బాపట్ల: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈనెల 7వ తేదీన బాపట్ల జిల్లా చీరాల మండలంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చేనేత దినోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారని ఆయన తెలిపారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
చీరాల: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సేవా పథకం ద్వారా మండలంలోని నేతన్నలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ నెల 7వ తేదీ సీఎం చంద్రబాబునాయుడు చీరాల రానున్నారు. సీఎం పాల్గొనే సభా ప్రాంగణం, హెలిప్యాడ్ కోసం స్థలాలను సోమవారం కలెక్టర్ వి.వినోద్కుమార్, ఎస్పీ బి.ఉమామహేశ్వర్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పరిశీలించారు. చీరాల బైపాస్, వేటపాలెం మండలం, జాండ్రపేట పరిసర ప్రాంతాల్లో అనువైన స్థలం కోసం పరిశీలన చేశారు. అయితే సీఎం సభ నిర్వహించే స్థలాన్ని ఇంకా ఖరారు చేయలేదు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కె.నరసింహారావు, ఏపీఎస్సీడీసీఎల్ ఎస్ఈ ఆంజనేయులు, ఆర్అండ్బీ ఈఈ వేణుగోపాల్, డీఈ నళిని, డీఎస్పీ ఎండీ మోయిన్, చీరాల, వేటపాలెం తహసీల్దార్లు గోపీకృష్ణ, గీతారాణి పాల్గొన్నారు.


