వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ మండలం పెరుమాళ్లపల్లి గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమో, లేదా అకస్మాత్తుగా వైర్లు తెగిపడడమో తెలీదు కానీ.. పొలాల మీదుగా వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ఏడు పాడి గేదెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. సేకరించిన వివరాల ప్రకారం.. పెరుమాళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు లగడపాటి శ్రీనివాసరావు తన గేదెలను మేతకోసం పొలాల వైపు తోలుకెళ్లగా, అక్కడ అప్పటికే తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లను గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. వైర్లకు తగలగానే విద్యుదాఘాతానికి గురై ఏడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
కన్నీటి పర్యంతమైన రైతు
‘నా కుటుంబానికి ఈ గేదెలే ప్రధాన జీవనాధారం. పాడి అమ్మగా వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడిచేది. ఒక్కసారిగా ఏడు గేదెలు చనిపోవడంతో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పుడు మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు’ అని బాధితుడు, గేదెల యజమాని శ్రీనివాసరావు కన్నీరు మున్నీరయ్యాడు. ఈ ప్రమాదంపై గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన రైతును ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, పరిసర ప్రాంతాల్లో వదులుగా ఉన్న విద్యుత్ లైన్లను సరిచేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


