విజయపురిసౌత్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యనభ్యసించి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ(ఏపీఆర్ఈఐఎస్) కార్యదర్శి కృష్ణమోహన్ అన్నారు. శనివారం స్థానిక ఏపీఆర్ జూనియర్ కళాశాలలో జరిగిన ఫ్రెషర్స్డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కళాశాల 1976–78 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 25 మంది హాజరవ్వటం ఎంతో సంతోషకరమన్నారు. పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ ఎం హేమాంబర్రెడ్డి మాట్లాడుతూ కళాశాల ప్రగతి, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల విజయాలను వివరించారు. తొలుత పూర్వ విద్యార్థులు అలుమ్ని సభ్యులు విద్యార్థి జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ విద్యార్థులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు జీవిత విలువలపై పలు సూచనలు చేశారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థులను ఏపీఆర్ఈఐఎస్ కార్యదర్శి కృష్ణమోహన్, సంయుక్త కార్యదర్శి ఉబేదుల్లా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


