తెనాలిటౌన్: మార్కెటింగ్శాఖ జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై అపోహలు అవసరం లేదని మార్కెటింగ్ శాఖ విజయవాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎం.దివాకర్ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం ది డాల్మిల్స్, పల్సెస్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ– ట్రాన్స్పోర్ట్ పర్మిట్ విధానంపై వ్యాపారులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఇచ్చారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రభుత్వం రూపొందించిన ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చెక్పోస్ట్ల వద్ద నగదు రశీదులు రాసి ఇవ్వడం పూర్తిగా రద్దు చేయబడిందని వెల్లడించారు. లైసెన్స్ కలిగిన వ్యాపారస్తుడు స్వతహాగా ఆన్లైన్ ఈ–పర్మిట్ తీసి సరుకు ఎగుమతి చేస్తున్న వాహన డ్రైవర్కు ఇచ్చి పంపాలని స్పష్టం చేశారు. వాహన డ్రైవర్ ఆన్లైన్ ఈ–పర్మిట్ ప్రింట్ను తన మొబైల్కు వచ్చిన నంబర్ను చెక్ పోస్టు వద్ద చూపించి స్కానింగ్ చేయించుకుని వెళ్లాలని సూచించారు. ముందస్తు ఆన్లైన్ ఈ–పర్మిట్ లేకుండా సరుకు ఎగుమతి చేస్తున్న వాహన డ్రైవర్ల నుంచి చెక్ పోస్టు వద్ద కేవలం ఫోన్పే, జీపే, పేటీఎం ఇతర డిజిటల్ పద్ధతిలోనే మార్కెట్ ఫీజు వసూలు చేసి పర్మిట్ జారీ చేయబడుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో నగదు అంగీకరించబడదని వెల్లడించారు. పర్మిట్ తీసుకున్న పది రోజుల వరకు గడువు ఇవ్వాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరగా ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపారులందరూ సహకరించాలని కోరారు.


