వినుకొండ: నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. మట్టిని సరిహద్దులు దాటిస్తూ రూ. కోట్లలో సంపాదిస్తున్నారు. వినుకొండ రూరల్ మండలం దొండపాడు గ్రామంలోని చెరువును ఆనుకుని ఉన్న మునిస్వామి కొండను పొక్లెయిన్లతో అక్రమంగా తవ్వి, వేలాది ట్రక్కులతో మట్టి తరలిస్తున్నారు. దీని వల్ల కొండపై ఉన్న చారిత్రక శివాలయం కనుమరుగయ్యే దశకు చేరుకుంది. రాత్రింబవళ్లు తేడా లేకుండా తవ్వి తరలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు వారికి అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు.
ఈ ప్రాంతాల్లో అధికం
వినుకొండ రూరల్ మండలంలోని నీలగంగవరం, వెంకుపాలెం, అలాగే బొల్లాపల్లి మండలంలోని పేరుపాడు, వెల్లటూరు, నూజెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వెంకుపాలెం జాలపాలెం గ్రామ పరిధిలోని ఎర్ర కొండ వద్ద భారీ యంత్రాలతో మట్టిని తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ధరను నిర్ణయిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ బొల్లాపల్లి, వినుకొండ రెవెన్యూ అధికారులు పరస్పరం సాకులు చెబుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కన్నెత్తి కూడా చూడని అధికారులు


