కలెక్టరేట్లో నివాళులర్పించిన జేసీ, ఎమ్మెల్యే, నాయకులు
నరసరావుపేట: సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి, సమాజం కోసం కష్టపడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే అని జాయింట్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జాయింట్ కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు చదలవాడ అరవిందబాబుతో కలసి ఫులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పూలే జీవిత చరిత్ర, పోరాటాలు, లక్ష్యాలు అందరూ తెలుసుకోవాలన్నారు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా అసమానతలు రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. మహిళలు చదువు లేకపోవడం వలన గుర్తింపు పొందడం లేదని గుర్తించి తన జీవిత భాగస్వామిని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది సమాజానికి ఆదర్శంగా నిలిచారన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేశారన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించారన్నారు. డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ మహాత్ముల జీవిత చరిత్రలు, బయోగ్రఫీలు అందరూ చదివి స్ఫూర్తి పొందాలన్నారు. తొలుత పల్నాడు బస్టాండు వద్ద ఉన్న ఫులే విగ్రహానికి జేసీ, శాసనసభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్డీఓ కె.బాలకృష్ణ, బాదుగున్నల శ్రీను, డాక్టర్ రాంప్రసాదు, టీడీపీ నాయకుడు వల్లెపు నాగేశ్వరరావు, వాసిరెడ్డి రవి, అధికారులు పాల్గొన్నారు.


