రైల్వే ఆర్వోబీ, ఆర్యూబీలను పూర్తి చేయండి
నరసరావుపేట: అందుబాటులో ఉన్న స్థలాన్ని వినియోగించి న్యూట్రి గార్డెన్ మోడల్స్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం న్యూట్రి, కమ్యూనిటీ, కిచెన్ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్, బయో–రిసోర్స్ సెంటర్లపై సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు బడులు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు, మహిళల ఇళ్ల వద్ద ఈ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రోజువారీగా పోషక విలువలతో కూడిన ఆహారం పొందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడం అత్యంత అవసరమని తెలిపారు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యూట్రి గార్డెన్స్ ప్రోత్సాహం కోసం గ్రామస్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలని సూచించారు. బయో–రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ల ఏర్పాటు, పాయింట్ పర్సన్స్ బాధ్యతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల నేల నాణ్యత దెబ్బతినడం, ఆరోగ్య సమస్యలు పెరగడం వంటి సమస్యల గురించి వివరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధ్యం అవుతాయని తెలిపారు. న్యూట్రి, కిచెన్, కమ్యూనిటీ గార్డెన్స్, సూర్య మండలం, ఏటీఎం మోడల్స్, టెర్రస్ ప్రాముఖ్యతను వివరించారు. శిక్షణలో భాగంగా విత్తనాల ఎంపిక, నీటి నిర్వహణ, సేంద్రియ ద్రావణాల తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార భద్రత పెంపొందించడంతోపాటు ప్రకృతి వ్యవసాయం విస్తరణకు, రైతుల ఆర్థిక స్థితి మెరుగుదలకు దోహద పడుతుందని అధికారులు తెలిపారు. స్పెషల్ కలెక్టర్ మనోజ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మెప్మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, డీపీఓ, ఎంపీడీఓలు, ఎంసీలు, ఏపీఎంలు, ఎంఈఓలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం
కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, పన్నుల విభాగ గుంటూరు జాయింట్ కమిషనర్ జాన్ స్టీవెన్సన్ పాత్రో పల్నాడు జిల్లా జీఎస్టీ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జీఎస్టీ వసూళ్లు పెంచడంలో వివిధ విభాగాలు అందించాల్సిన సహకారం, ఆవశ్యకత వివరించారు. జిల్లాలో పనిచేస్తున్న వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల అసిస్టెంట్ కమిషనర్లు హాజరయ్యారు.
జిల్లాలో రైల్వే సంస్థ చేపట్టిన ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి), ఆర్యూబీ (రోడ్ అండర్ బ్రిడ్జి)ల నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ నారదముని, ఆర్డీఓ మురళీకృష్ణ, రైల్వే శాఖ ప్రధాన అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా


