యూజీ ఐదో సెమిస్టర్ ఫలితాలు విడుదల
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేషన్ ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఏఎన్యూ పరిధిలో గత ఏడాది నవంబరులో జరిగిన అండర్ గ్రాడ్యుయేషన్ రెగ్యులర్ ఐదో సెమిస్టర్ పరీక్షలకు 6,991 మంది హాజరు అయ్యారని తెలిపారు. వారిలో 6,721 మంది ఉత్తీర్ణులు అయ్యారన్నారు. రీవాల్యూయేషన్కు ఈ నెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, యూజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. సబ్జెక్ట్కు ఫీజు రూ.1,640 కాగా, పర్సనల్ వెరిఫికేషన్ ఫీజు కూడా అంతేనని వివరించారు. వివరాలు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు.
తాడికొండ: తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో అస్సాంకు చెందిన కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని వాజ్పేయి విగ్రహం సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించారు. ఆధార్ కార్డు ప్రకారం అతడు అస్సాంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. జేబులో డ్రైవింగ్ లైసెన్సు కూడా ఉంది. రాజధాని భవన నిర్మాణ కూలీగా లేదా డ్రైవర్గా వచ్చి ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరుకు చెందిన మల్లవరపు జీవారత్నం (58) గత నెల 28వ తేదీన పేరేచర్ల నుంచి టెంట్ హౌస్ సామగ్రిని ఆటోలో తీసుకుని గుంటూరు వైపుగా వెళుతున్నాడు. ఈ క్రమంలో చిన్నపలకలూరు రైల్వే గేటు సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. జీవరత్నంకు తీవ్రగాయాలు కాగా... స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుని కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంగళగిరి టౌన్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ జీతాల ప్యాకేజీ కింద రూ. 1.11 కోట్ల బీమా క్లయిమ్ చెక్కును బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు గురువారం రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ గుంటూరు బ్రాంచ్ అధికారి సతీష్కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ఉద్యోగికి రూ. 1.11 కోట్ల వరకు బీమా రక్షణ కల్పించబడుతుందన్నారు. ఇటీవల ఏపీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న కీర్తి వెంకటరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలిపారు. ఆయన భార్య నన్నూరమ్మకు ఈ క్లయిమ్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేసినట్లు పేర్కొన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా చెక్కును అధికారికంగా అందజేశామని పేర్కొన్నారు. బ్యాంకు గుంటూరు ప్రాంతీయ కార్యాలయ ఏజీఎం, రీజనల్ హెడ్ కిరణ్రెడ్డి, విజయవాడ ప్రాంతీయ కార్యాలయ డీజీఎం, రీజనల్ హెడ్ అనుపమ్ శ్రీవాత్సవ, హైదరాబాద్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వయిజర్ బ్రిగేడియర్ సంజయ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు.
యూజీ ఐదో సెమిస్టర్ ఫలితాలు విడుదల
యూజీ ఐదో సెమిస్టర్ ఫలితాలు విడుదల


