ఉద్యోగుల బకాయిలు సత్వరం విడుదల చేయాలి
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్రవ్యాప్త వినతిపత్రాల ఆందోళనలో భాగంగా గురువారం సంఘం పల్నాడుజిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులకు బకాయిలు చెల్లింపు అంశంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరాయని తెలిపారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి విడుదలపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన కార్యచరణ రాలేదన్నారు. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరారు. అలాగే రానున్న బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు నిధులు కేటాయించాలని తెలిపారు. రాష్ట్రంలోని 175 మంది శాసనసభ్యులతో పాటు 58 మంది శాసనమండలి సభ్యులకు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నట్టు వివరించారు. తమ సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ డి.వి.సుబ్బారావు, సంఘం తాలూకా అధ్యక్షురాలు ఎం.ఫ్లోరెన్స్, ఉపాధ్యక్షుడు వందనం బాబు పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం డిమాండ్


