దళితులపై మారణకాండ ఆపాలి
గుంటూరు వెస్ట్: ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు టి.ఎం. రమేషన్ దారుణ హత్యపై ప్రభుత్వం విచారణ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని రాష్ట్ర కో–కన్వీనర్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం లేదన్నారు. ఈ ఏడాది జనవరిలో కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, బొందిమడుగుల గ్రామానికి చెందిన రమేష్ను దారుణంగా కొట్టిచంపారన్నారు. దీనిని దళిత, ప్రజా సంఘాలు ఖండించాయని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం డీఆర్వో షేఖ్ ఖాజావలికి విజయ్ కుమార్, కారుమూరు బెర్నార్డ్ మాదిగ, ఎస్ప్రసాదరావు మాదిగ, కె.వీరబాబు మాదిగ వినతిపత్రం అందజేశారు.
బాపట్ల టౌన్: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ కె.వెంకటరమణ గుండెపోటుతో మృతిచెందారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ (57) ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తెనాలిలోని హరిత హాస్పిటల్లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతిక దేహాన్ని పొన్నూరు మండలం, గాయంవారిపాలెంలోని వారి స్వగృహం నందు ఉంచగా, బాపట్ల సబ్ డివిజన్ ఇన్చార్జ్ డీఎస్పీ (సీసీఎస్ డీఎస్పీ) పి.జగదీష్ నాయక్, బాపట్ల పట్టణ సీఐ ఆర్.రాంబాబు, ఇతర పోలీసు అధికారులు, సహద్యోగులు సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటరమణ 1990 సంవత్సరంలో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలోకి ప్రవేశించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి ఏఎస్ఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మృతిచెందారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్ఐ భౌతిక దేహానికి పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం రూ. లక్ష నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గాయంవారి పాలెం సమీపంలో గల స్మశాన వాటికలో పోలీస్ అధికార లాంఛనాలతో ఏఎస్ఐ మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.


