
పెండింగ్ కేసులు తగ్గించండి
నరసరావుపేట: జిల్లాలో పెండింగ్ కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షలో పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. పోలీస్స్టేషన్లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారుల విషయంలో ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. నిర్లక్ష్యంగా స్పందించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. యడ్లపాడు, చిలుకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులలో కోర్టు ఈ నెలలో నిందితులకు శిక్షలు విధించినందున సంబంధిత పోలీసు అధికారులను అభినందించారు. అడ్మిన్ అదనపు ఎస్పీ జేవీ సంతోష్, నరసరావుపేట, సత్తెనపల్లి డీఎస్పీలు కె.నాగేశ్వరరావు, ఎం.హనుమంతరావు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ సూచన