ఏజెంట్లే కీలకం | - | Sakshi
Sakshi News home page

ఏజెంట్లే కీలకం

Apr 25 2025 8:16 AM | Updated on Apr 25 2025 8:16 AM

ఏజెంట

ఏజెంట్లే కీలకం

యానిమేషన్‌ మాయలో

సాక్షి, నరసరావుపేట, నరసరావుపేటటౌన్‌: యానిమేషన్‌ మాయలో ఏజెంట్ల పాత్ర కీలకంగా కనిపిస్తోంది. రూపాయి పెట్టుబడి పెడితే రెట్టింపు రాబడి అంటూ ప్రచారంతో రూ.వందల కోట్లు వసూల్‌ చేసి బోర్డు తిప్పేసిన యానిమేషన్‌ స్కాం లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్థోమతకు మించి పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగిరావని మనోవేదనకు గురై నరసరావుపేటకు చెందిన గుండా నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. పెద్ద మొత్తంలో బాధితుల చేత పెట్టుబడి పెట్టించడానికి యానిమేషన్‌ సంస్థ ప్రత్యేకంగా ఏజెంట్ల నియామకం చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ కేంద్రంగా సాగిన యానిమేషన్‌ స్కాంలో గుంటూరు వాసిది కీలకమని తెలుస్తోంది. ఆయన ఏజెంట్‌గా అవతారమెత్తి బడా వ్యాపారుల చేత దగ్గరుండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించాడట. ప్రధాన సూత్రధారి కిరణ్‌ అజ్ఞాతంలోకి వెళ్లడంతో పెట్టుబడి దారుల నుంచి ఒత్తిడి పెరిగింది. పెట్టుబడి పెట్టే సమయంలో అంతా తనదే బాధ్యత అన్న గుంటూరు ఏజెంట్‌ నేడు నాకే సంబంధం అంటూ బుకాయిస్తున్నాడు. దీంతో అతను చేసిన మోసంపై బాధితులు నరసరావుపేట పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.

చివరి వరకు వంచన...

గత ఏడాది చివరిలో గడువు పూర్తి అయ్యి పెట్టుబడితో పాటు లాభం నగదు చాలమందికి చేతికి అందాలి. అయితే గత ఏడునెలలుగా చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. సాంకేతిక కారణాల వల్ల నగదు ఆగిపోయిందని, వచ్చే నెలలో వస్తాయంటూ ప్రతిసారి కిరణ్‌ చెప్పుకొచ్చాడు. అయినప్పటికి డిసెంబర్‌, జనవరి మాసాల్లో సైతం పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తంలో నగదు సమకూర్చుకున్నాడు. ఫిబ్రవరి నెల నుంచి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితులంతా విజయవాడలోని కార్యాలయానికి వెళ్లి ఒత్తిడి తెచ్చారు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో చివరకు తమిళనాడు వెళ్లి తలదాచుకున్నాడు. అక్కడి నుంచి బాధితులకు డబ్బు విషయంలో ఆధైర్యపడవద్దంటూ వీడియో సందేశాలను విడుదల చేశాడు.

ఒక్కొక్కరుగా బయటపడుతున్న బాధితులు...

గుండా నాగేశ్వరరావు మృతి తరువాత బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మొదట రూ.400 కోట్లు అనుకున్న బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. బాధితులు ఒకరికి తెలియకుండా ఒకరు నేరుగా ఏజెంట్‌, కిరణ్‌లకు నగదు చెల్లించారు. ఇందులో కొందరు మాజీ పోలీసు అధికారులు, నరసరావుపేటకు చెందిన మహిళలు కూడా ఉండటం గమనర్హం. బుధవారం విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో నరసరావుపేటకు చెందిన టి. శ్రీనివాసరావు, కె దిలిప్‌కుమార్‌లు తాము సుమారు రూ.16 కోట్లు చెల్లించి మోసపోయామని కిరణ్‌పై ఫిర్యాదు చేశారు.

పెట్టుబడులు పెట్టించడానికి ప్రత్యేకంగా నియామకం ఒక్కొక్కటిగా బయటపడుతున్న లీలలు 30 శాతం కమీషన్‌ ముట్టజెప్పడంతో అధిక మొత్తంలో పెట్టుబడులు గుంటూరు కేంద్రంగా యానిమేషన్‌ ఏజెంట్‌ భారీగా పెట్టుబడుల సేకరణ రోజు రోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య కుంభకోణంపై కేసులు... మాకు సంబంధం లేదంటున్న పోలీసులు

30 శాతం కమీషన్‌...

మాకేం సంబంధం లేదు...!

పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కితే తమకు న్యాయం జరుగుతుందేమోనని కొందరు భావించినా మొదట్లోనే వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కొందరు పోలీసు అధికారులను బాధితులు కలసి తాము డబ్బులు చెల్లించి నిండా మునిగామని చెప్పి చెప్పక ముందే యానిమేషన్‌ కార్యాలయం విజయవాడలో ఉన్న కారణంగా తమ పరిధి కాదని, అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సలహా ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ విషయానికొస్తే గత నాలుగు రోజులుగా పత్రికల్లో యానిమేషన్‌ స్కాంపై కథనాలు వస్తున్నప్పటికి కనీస స్పందన లేదు. జరిగిన ఆర్థిక నేరంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థను నియమించి న్యాయం జరిగేలా కృషి చేయాలని బాధితులు కోరుతున్నారు.

యూపిక్స్‌ అనే యానిమేషన్‌ కంపెనీలో పెట్టుబడులు పెట్టించినందుకు గుంటూరుకు చెందిన రాజు అనే ఏజెంట్‌కు పెద్ద మొత్తంలో కమీషన్‌ ముట్టినట్టు బాధితులు తెలుపుతున్నారు. నరసరావుపేటకు చెందిన పొగాకు వ్యాపారి అతనికి బంధువు కావడంతో నమ్మి సుమారు రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు. విషయం తెలుసుకొన్న మరో బంగారం వ్యాపారి రూ.20 కోట్ల వరకు యానిమేషన్‌లో పెట్టుబడి పెట్టారు. వీరి తో పాటు మరి కొందరు సుమారు రూ.30 కోట్ల వరకు రాజు ఆధ్వర్యంలో చెల్లించారు. అంతా తనదే బాధ్యతని, మీ డబ్బుకు నాది గ్యారెంటీ అంటూ నమ్మబలికి గుంటూరు కార్యాలయ కేంద్రంగా పెట్టుబడు లు సేకరించారు. నగదులో 30 శాతం కమీషన్‌ రాజు మినహాయించుకొని మిగిలిన డబ్బులు సంస్థ యజమాని కిరణ్‌కు అప్పగించేవాడని బాధితులు చెప్పుకొస్తున్నారు. తీరా కిరణ్‌ పరారవ్వడంతో కమీషన్‌ కోసం ఏజెంట్‌ తమను ముంచాడని బాధితులు వాపోతున్నారు.

ఏజెంట్లే కీలకం 1
1/1

ఏజెంట్లే కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement