
‘సాక్షి’పై దాడి హేయమైన చర్య
నరసరావుపేట: ఏలూరులో సాక్షి పత్రికా కార్యాలయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని అనుచరుల దాడి ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టులాంటిదని జర్నలిస్టు, ప్రజాసంఘాలు, సీపీఐ, ఎంసీపీఐయూ, ఎంఐఎం నాయకులు పేర్కొన్నారు. నిజాలను నిర్భయంగా రాసే ‘సాక్షి’పై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించారు. దాడిని నిరశిస్తూ గురువారం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పల్నాడు జిల్లా ప్రెస్, నరసరావుపేట, ఇతర జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ ఏకా మురళికి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ వార్తలు రాశారనే ఉద్దేశ్యంతో పత్రికా కార్యాలయాలపై దాడులు చేయటం హేయమైన చర్య అన్నారు. జర్నలిస్టులపై దాడులు ఏమాత్రం భావ్యంకాదని, పత్రికా స్వేచ్ఛపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
చింతమనేనిని అరెస్టు చేయాలి..
దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహజంగానే రౌడీయిజం చేస్తుంటాడని, చంద్రబాబు మెప్పుకోసమే ఈ దాడి చేశాడన్నారు. కూటమి ప్రభుత్వానికి కావాల్సింది ఇదేనన్నారు. వెంటనే ప్రభాకర్పై కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు బాధాకరమన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ ఒక వీధిరౌడీ అని, మాటలు, చేష్టలు ఆవిధంగానే ఉంటాయన్నారు. పల్నాడులో బాధితులు చెప్పిన వాస్తవాలను రాసిన ‘సాక్షి’ విలేకర్లపై కేసులు పెట్టడం దారుణమన్నారు. ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి రెడ్ బాష మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించే పద్ధతులను పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ఎంఐఎం కరిముల్లా, వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు నంద్యాల జగన్మోహన్రెడ్డి, వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా బాధ్యులు బి.ప్రసాదు, పల్నాడు జిల్లా ప్రెస్క్లబ్, నరసరావుపేట అధ్యక్షుడు సీహెచ్.వి.రమణారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ‘సాక్షి’ స్టాఫ్ రిపోర్టర్ ఆర్.లవకుమార్రెడ్డి, షేక్ జిలాని, పి.కోటిరెడ్డి, జి.సాంబశివారెడ్డి, సుంకిరెడ్డి, నాగరాజు, బుచ్చిబాబు, అప్పారావు, శివ, స్వామి, షేక్ సాజిద్, పీడీఎం నాయకుడు నల్లపాటి రామారావు, బాదుగున్నల శ్రీను, బీసీ నాయకుడు బత్తుల వెంకటేష్, పీకేఎస్ నాయకుడు కంబాల ఏడుకొండలు పాల్గొన్నారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలి నరసరావుపేటలో జర్నలిస్టులు, సీపీఐ, ఎంసీపీఐయూ, ఎంఐఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా జిల్లా ఎస్పీ, డీఆర్ఓలకు వినతిపత్రాలు

‘సాక్షి’పై దాడి హేయమైన చర్య