
ఒరిగిన రామలింగేశ్వర ఆలయ శిఖరం
అమరావతి: అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు రామేశ్వరం యాత్రకు వెళ్లి, గుర్తుగా రామలింగేశ్వర విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్టించి, స్థానికంగా ఆలయ నిర్మాణం చేశారు. అప్పటినుంచి ఆలయంలోని రామలింగేశ్వరునికి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయం ఏళ్లతరబడి ఆదరణ లేక నిర్లక్ష్యానికి గురైంది. ఈక్రమంలో ఇటీవల గాలివానకు ఆలయ విమాన శిఖరం ఒరిగి వేలాడుతోంది. ఆలయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆలయ శిఖరానికి దూరం నుంచి నమస్కారం చేసుకుంటే స్వామివారికి నమస్కరించినట్లేనని భక్తుల నమ్మకం. ఆటువంటి శిఖరానికి అపచారం జరిగినా పట్టించుకోని దేవాలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేపటి నుంచి విస్తరణ సలహా మండలి సమావేశాలు
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో 2024–25 ఏడాదికిగానూ కృష్ణ మండలం పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు లాంఫాం ఏడీఆర్ డాక్టర్ దుర్గాప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23, 24 తేదీల్లో రెండు రోజులపాటు సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గత ఏడాది కార్యచరణ, సలహాల మేరకు చేపట్టిన కార్యక్రమాలు, ప్రగతి, రానున్న ఏడాది నిర్వహించే కార్యక్రమాలు, పరిశోధన, విస్తరణపై చర్చలు జరుగుతాయన్నారు. రైతులు, శాస్త్రవేత్తలు, సలహా మండలి సభ్యులు తదితరులు పాల్గొంటారన్నారు.
ఘనంగా సివిల్ సర్వీసెస్ డే
నరసరావుపేట: సివిల్ సర్వీసెస్ డేను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయలను అధికారులు సత్కరించారు. సోమవారం టౌన్హాలులో వారిద్దరికీ దుశ్శాలువాలు కప్పి పూలదండలు వేసి శుభాకాంక్షలు తెలియచేశారు. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 3.02 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 18 రోజులకుగాను రూ. 3,02,92,986 నగదు, 440 గ్రాముల బంగారం, 5.225 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. కానుకల లెక్కింపును ఈవో పర్యవేక్షించగా, ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఆలయ అధికారులు, సిబ్బంది, సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా జడ్జిగా కల్యాణ్ చక్రవర్తి బాధ్యతలు
గుంటూరు లీగల్ : జిల్లా జడ్జిగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బి.కల్యాణ్ చక్రవర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రెసిడెంట్ తుబాటి శ్రీను, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసరావు, టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మనాయక్లు న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు. సెక్రటరీ నవీన్, స్టేట్ జనరల్ సెక్రటరీ పి. రాంగోపాల్, జాయింట్ సెక్రటరీ బ్రహ్మయ్య, శేషగిరి, హరిబాబు, ఖాజా, కల్యాణి పాల్గొన్నారు.

ఒరిగిన రామలింగేశ్వర ఆలయ శిఖరం

ఒరిగిన రామలింగేశ్వర ఆలయ శిఖరం