
గ్రంథాలయాల అభివృద్ధికి ఉద్యమించాలి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధిని ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వానికి పలు సూచనలు చేసేందుకు శ్రీనాథ సాహితీ పరిషత్, ఆంధ్ర చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడురోడ్డులోని కార్యాలయంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరిషత్ కార్యదర్శి స్వర్ణ చినరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు ప్రజలు తాము చెల్లించే పన్నులో 8 శాతం గ్రంథాలయాల పన్నుగా ఉంటుందన్నారు. ఆ నిధులతో గ్రంథాలయాల ఏర్పాటు, అభివృద్ధిని ప్రభుత్వాలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. గ్రంథాలయాల పరిరక్షణకు ఈనెల 27వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పల్నాడు జిల్లాలో గ్రంథాలయాల అభ్యున్నతికి స్వర్ణ చినరామిరెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. ఈసందర్భంగా గ్రంథాలయ పునర్వికాస వేదిక పల్నాడు జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్గా చినరామిరెడ్డి, కో–కన్వీనర్గా షేక్ బాజీ, సభ్యులుగా బత్తుల మురళి, ఈవూరి వెంకటరెడ్డి, డి.వెంకటేష్, ఎస్.వి.చలమారెడ్డి తదితరులను నియమిస్తూ నిర్ణయించారు. అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్చంద్ర జ్యోతిశ్రీ, జిల్లా కార్యదర్శి కోసూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.