
పాత్రలకు జీవం.. నటనంటే ప్రాణం
యడ్లపాడు: యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన హిందీ ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, ఆదిశేషమ్మ దంపతులకు చెన్నకేశవ ప్రసాద్ జన్మించారు. ఆరేళ్ల ప్రాయంలోనే నటనలో అరంగేట్రం చేసిన ప్రసాద్కు ప్రాథమిక గురువుగా చెన్నుపాటి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. ఐ.రాజ్కుమార్ అభినయ నైపుణ్యాలు నేర్పించారు. అనంతరం డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు ప్రోత్సాహంతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో ‘ఆన్సర్’లో ప్రసాద్ నటనకు ఏపీ ప్రభుత్వం బంగారు నంది అవార్డు బహూకరించింది.
ఆకాశవాణిలోనూ..
27 సంవత్సరాలపాటు ఆకాశవాణిలో కళాకారుడిగా ప్రసాద్ సేవలందించారు. ఆయన గళం, సంభాషణ పలికే తీరు, భావం అన్నీ సమపాళ్లలో మిళితమై వినిపించేవి. చిన్నపాటి రేడియో నాటకాలు, ప్రత్యేక కార్యక్రమాల్లోనూ ఆయన స్వరం వినిపించగానే శ్రోతకు ప్రసాద్ గుర్తొచ్చేవారు. ఇలా రంగస్థలం వేదికపైనే కాకుండా ఆకాశవాణి, దూరదర్శన్, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్లోనూ నటించి ప్రతిభ చాటారు. ప్రసాద్ 1976లో గుంటూరు రీజినల్ ఇంటర్మీడియట్ కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగంలో చేరారు. తరువాత ఇంటర్ కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు నిర్వహించారు. 2016లో పదవీ విరమణ చేశారు. అయినా నటనకు మాత్రం దూరం కాలేదు. నాటకరంగ ప్రముఖులైన నాయుడు గోపి, షేక్ షఫీ, మల్లాది శివ, కందిమళ్ల రాఘవ, సింగరకొండ చౌదరి, అమృతలహరి, పురుషోత్తం, మధిర సుబ్బరాజు తదితర ప్రముఖుల దర్శకత్వంలో వేర్వేరు పాత్రల్లో ప్రసాద్ నటించారు. తనదైన భాష, అభినయంతో ఆ పాత్రలకు వన్నె తెచ్చారు.
వరించిన పురస్కారాలు
ఉత్తమ నటుడు, విలన్, హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెయ్యికిపైగా పురస్కారాలను ప్రసాద్ సొంతం చేసుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. క తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా స్థాయిలో కందుకూరి పురస్కారాన్ని స్వీకరించారు. పల్నాడు జిల్లా స్థాయి కందుకూరి పురస్కారాన్ని ప్రసాద్ బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నుంచి తెలుగు నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ సమక్షంలో అందుకున్నారు.
నాటకం సమాజాన్ని ప్రతిబింబించే అద్దం. అందులో తన రూపాన్ని నింపుకొంటూ సామాజిక బాధ్యతనే కథాంశంగా మార్చుకున్న కళాకారుడు వంకాయలపాటి చెన్నకేశవ ప్రసాద్. నాటకమంటే వల్లమాలిన ప్రేమ. తన జీవితాన్ని కళారంగానికే అంకితం చేశారు. తాజాగా కందుకూరి విశిష్ట పురస్కారాన్ని అందుకున్న ఆయనపై ప్రత్యేక కథనం ఇది.
రంగస్థల వేదికపై పరిపూర్ణ నటుడు ప్రసాద్
సాంఘిక నాటకాల్లో పలు పాత్రలతో గుర్తింపు
ఉన్నవ వాసిని వరించిన కందుకూరి పురస్కారం

పాత్రలకు జీవం.. నటనంటే ప్రాణం