
పైపులైన్ పనులు ఆగవు
ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా
నకరికల్లు: ఒప్పుకున్నా లేకున్నా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని పైపులైన్ చేపడతామని అధికారులు రైతులను హెచ్చరించారు. బీపీసీఎల్ పైపులైన్ ఏర్పాటులో భాగంగా మండలంలోని చల్లగుండ్ల, నకరికల్లు, నర్శింగపాడు గ్రామాల రైతులతో స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీదేవి మాట్లాడుతూ బీపీసీఎల్ పైపులైన్ ఏర్పాటుకు భూములు తీసుకునేది భూసేకరణ కిందకు రాదని భూ వినియోగం మాత్రమేనన్నారు. గుర్తించిన భూమిలో ఆరుమీటర్ల లోతులో ఒకటిన్నర మీటరు వెడల్పులో పైపులైను ఏర్పాటు ఉంటుందన్నారు. పైపులైను పనులు చేపట్టేందుకు 18 ఇంటు 18మీటర్ల వెడల్పులో భూమిని వినియోగించుకొని పైపులైన్ పూర్తయ్యాక భూమిని యథావిధిగా బాగు చేసి ఇస్తామన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంట పూర్తయ్యాకే పనులు చేపతామన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్న భూముల విలువను బట్టి రెండున్నర రెట్లు కలిపి మొత్తం సెంటుకు రూ12వేలు చొప్పున రైతులకు చెల్లిస్తామని తెలిపారు. దీనికిగాను రైతులు అంగీకారపత్రం ఇవ్వాలని ఒకవేళ ఒప్పుకోకుంటే ఇది కేంద్రప్రభుత్వం ప్రాజెక్టు అని పోలీస్ బందోబస్తు నడుమ అయినా పూర్తిచేసి తీరాల్సి వస్తుందని హెచ్చరించారు.
డిమాండ్లకు ఒప్పుకొంటేనే భూములిస్తాం..
పైపులైను వేసిన భూముల్లో గోడౌన్లు కట్టుకోవాలన్నా... ప్లాట్లు వేసుకోవాలన్నా... అమ్ముకోవాలన్నా, భూమిలో పైపులైన్లు ఉండడం మూలంగా ఇబ్బందులు తలెత్తుతాయని, పనులు చేపట్టే క్రమంలో భూమిని పంటకు పనికిరాకుండా చేస్తారని, హద్దురాళ్లు చెల్లాచెదరు చేస్తారని రైతులు వాపోయారు. హామీలు నెరవేరుస్తామని రాతపూర్వకంగా ఇవ్వాలని, అలాగే సెంటుకు రూ.20వేలు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే భూములు ఇచ్చేందుకు ఒప్పుకోమని రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆర్డీఓ రమణాకాంత్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే పనులు చేపట్టిన 105 గ్రామాల్లో సెంటుకు రూ 2వేలు చొప్పున మాత్రమే ఇచ్చారని, ఇక్కడి రైతుల కోసం రూ 12వేలు ఇస్తున్నార న్నారు. తహశీల్దార్ కె.పుల్లారావు, బీపీసీఎల్ ప్రాజెక్టు లీడర్ భగవాన్ శుక్లా, సైట్ ఆఫీసర్ అమిత్ కాంబ్లో, సైట్ ఇన్చార్జి పవన్, వీఆర్వోలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
పోలీసుల భద్రతలో పూర్తిచేస్తాం బీపీసీఎల్ పైప్లైన్ ఏర్పాటుపై రైతులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మూడు గ్రామాల రైతులు

పైపులైన్ పనులు ఆగవు