28న సీఎం జగన్‌ తెనాలి పర్యటన | - | Sakshi
Sakshi News home page

Feb 26 2023 1:12 AM | Updated on Feb 27 2023 5:36 PM

- - Sakshi

తెనాలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెనాలి పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించినట్టుగా ఈ నెల 27వ తేదీ కాకుండా 28వ తేదీ సీఎం పర్యటన ఉంటుందని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ప్రకటించారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి తెనాలికి చేరుకుంటారని, వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జరిగే సభలో రైతులకు నాలుగో సంవత్సరం మూడో విడత వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ ఆర్థిక సాయం, ఇటీవల పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో శనివారం మార్కెట్‌ యార్డులో నిర్మిస్తున్న బహిరంగ సభా వేదిక, హెలిప్యాడ్‌ వద్ద జరిగే పనులను వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ సి.హరికిరణ్‌, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ ఆరిప్‌ హఫీజ్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌తో కలిసి పరిశీలించారు. వీరితో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి, తెనాలి సబ్‌కలెక్టర్‌ గీతాంజలి శర్మ, జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, తెనాలి డీఎస్పీ డాక్టర్‌ కె.స్రవంతిరాయ్‌ ఉన్నారు. అనంతరం తెనాలి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సీఎం పర్యటనపై జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నేటి నుంచి నృసింహుడి బ్రహ్మోత్సవాలు
7న దివ్య రథోత్సవం
మంగళగిరి: పానకాల లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమై మార్చి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నేతృత్వంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి పెండ్లి కుమారుడి ఉత్సవంతో ప్రారంభం కానున్నాయి. 27వ తేదీ రాత్రి 8 గంటలకు ధ్వజారోహణం, 6వ తేదీ రాత్రి 12 గంటలకు స్వామివార్ల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 7న ఉదయం 6 గంటలకు బంగారు గరుడోత్సవం, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దివ్య రథోత్సవం నిర్వహించనున్నారు.
మార్చి 8 నుంచి టెన్త్‌ ప్రీఫైనల్‌ పరీక్షలు
ఎఫ్‌ఏ–4కు బదులుగా ప్రీ–ఫైనల్‌ పరీక్ష
గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మార్చి 8 నుంచి 16వ తేదీ వరకు ప్రీ–ఫైనల్‌ పరీక్షలు జరగనున్నాయి. ప్రీ–ఫైనల్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి జరగనున్న పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేసేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా పబ్లిక్‌ పరీక్షల మాదిరిగా ఆరు పేపర్ల విధానంలో రూపొందించిన ప్రశ్నపత్రాలతో ప్రీ–ఫైనల్‌ పరీక్షలు జరుగుతాయి. మార్చి నెలాఖరులో నిర్వహించాల్సిన ఎఫ్‌ఏ–4 పరీక్షలను రద్దు చేసి, వాటి స్ధానంలో ప్రీ–ఫైనల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు హెచ్‌ఎంలు, ఉప విద్యాశాఖాధికారులు, డీఈవోలు తగు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ వీఎస్‌ సుబ్బారావు మార్గదర్శకాలు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement