సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తాం
ప్రజల్లో భరోసా పెంచుతాం
ఎస్సీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుశం క్రైమ్ : జిల్లాలో మెగా పల్లెనిద్రలో భాగంగా 830 గ్రామాల్లో పోలీసులు సోమవారం రాత్రంతా బస చేశారు. ప్రజల్లో భద్రతా భరోసాను పెంపొందించడమేకాక రానున్న ఎన్నికల నాటికి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడమే పల్లె నిద్ర ముఖ్య ఉద్దేశమని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి పోలీసూ గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఎస్పీ స్వయంగా గార మండలం కళింగపట్నంం గ్రామంలో పల్లె నిద్ర చేశారు. ఆయనతో పాటు రూరల్ సీఐ పైడపునాయుడు, స్పెషల్ బ్రాంచి సీఐ ఇమ్మాన్యుయల్ రాజు, గార ఎస్ఐ గంగరాజు పాల్గొన్నారు. శ్రీకాకుళం రెండో పట్టణ పరిధి పుణ్యపువీధి 12వ వార్డులో సీఐ పి.ఈశ్వరరావు, ఒకటో పట్టణ పరిధి కంపోస్టు కాలనీలో ఎస్ఐ ఎం.హరికృష్ణలు తమ సిబ్బందితో పాటు పల్లె నిద్ర చేశారు.
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో..
కళింగపట్నం గ్రామాన్ని సందర్శించిన ఎస్పీకి అక్కడి స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యలు, పబ్లిక్ న్యూసెన్సు, మాదక ద్రవ్యాల ప్రభావం, రోడ్డు ప్రమాద నివారణ వంటి అంశాలు దృష్టికి తెచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేర ఛేదనలో కీలకపాత్ర పోషిస్తాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామాల్లోని ముఖ్యప్రాంతాలతో పాటు వీలైనంతవరకు ప్రతీ ఇంటి వద్ద సీసీ కెమెరాలు పెట్టుకోవాలన్నారు.
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
యువతను తీవ్రంగా ప్రభావం చేస్తున్న గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సమాచారం సామాజిక స్పృహతో ప్రజలు పోలీసులకు తెలియపర్చితే నియంత్రణకు సహకరించినట్లువుతుందన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం..
ప్రతి గ్రామానికి దత్తత కానిస్టేబుల్ను నియమించి 15 రోజులకోసారి గ్రామాన్ని సందర్శించేలా చేసి గ్రామస్తులతో నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేవిధంగా కృషిచేస్తామని ఎస్పీ అన్నారు. పోలీసుల వైపు నుంచి నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.


