● ముఖలింగం అష్ట దిక్పాలకుల గర్భగుడిలో శునకాల విహారం ● పట్టించుకోని దేవదాయ, కేంద్ర పురావస్తు శాఖ అధికారులు
జలుమూరు: మహాదేవునికి అపచారం జరిగింది. శ్రీముఖలింగంలోని ఒక శివలింగం పానపట్టంపై శునకం నిద్రించింది. ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీముఖలింగానికి దక్షిణ కాశీగా పేరుంది. కాశీకి తుల్యమైనదిగా భావించి ఇక్కడకు దేశవిదేశాలతోపాటు ప్రపంచం నలుమూలలు నుంచి భక్తులు వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత గల దేవాలయాన్ని అటు దేవదాయ శాఖతోపాటు కేంద్ర పురావస్తు శాఖ నుంచి సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. కానీ అష్ట దిక్పాలకులు ప్రతిష్టించిన శివలింగాలను కనీసం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మంగళవారం ప్రధాన దేవాలయంలో ఉన్న అష్ట శివలింగాల్లో ఒకటైన దేవేంద్రుడి ప్రతిష్టితమైన ఇంద్ర లింగం గర్భగుడిలో పానపట్టంపై శునకాలు పడుకుని కనిపించాయి. ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆలయ నిర్వహణపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంలోని గర్భగుడిలో శునకాలు ప్రవేశించడం దేవదాయ శాఖ నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనమని అంటున్నారు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ నిర్వహణపై లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఎంతో విశిష్టత గల ఈ దేవాలయం నిర్వహణ ఇలా గాలికి వది లేయడం మంచి పద్ధతి కాదు. ఎంతో విశ్వాసంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ చూస్తే ఇలా ఉంది. దేవదాయ శాఖ ఏం చేస్తున్నట్టు? ఇది భక్తులు మనో భావాలను దెబ్బతీయడమే.
– బి.ఆనంద్, భక్తుడు,
విజయనగరం
కేవలం ఇక్కడ అధికారులు ఆలయానికి వచ్చిన భక్తులు నుంచి ఎంత ఆదాయం వస్తుందో అని చూడడం తప్ప ఆలయంపై కనీస నిర్వహణ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలి.
– కె.సతీష్, భక్తుడు,
పాలకొండ


