రణస్థలం: రపజా సమస్యలపై పోరాడేందుకు ప్రతిపక్ష పార్టీ ఏ చిన్న కార్యక్రమం చేసినా పోలీసులు అనుమతులు ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అదే అధికార పార్టీ అనుమతులు తీసుకోకపోయినా పక్కన నిలబడి వత్తాసు పలకడం సరికాదని మండల ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఏడాది జూన్ 12 నాటికి చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలు ఇస్తామన్న హామీలు అమలు చేయలేదని వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ప్రతిపక్ష పార్టీ బైక్ ర్యాలీ చేపడతామని అనుమతి కోరితే పోలీసులు అనుమతులు మంజూరు చేయలేదు. రణస్థలం ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయని, జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ చేయడానికి కుదరదంటూ నిలువరించేశారు. అదే అధికార పార్టీలో భాగమైన జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం చేపట్టే భారీ బైక్ ర్యాలీకి లావేరు నుంచి సుభద్రపురం, రణస్థలం, కోష్టా మీదుగా పైడిభీమవరం వరకు జాతీయ రహదారిపై దర్జాగా అనుమతి ఇచ్చేశారు. అప్పుడు ప్రతిపక్ష పార్టీకి వర్తించే నిబంధనలు.. ఇప్పుడు అధికార పార్టీకి వర్తించవా? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, లావేరు ఎస్సై వి.సందీప్కుమార్ వద్ద ప్రస్తావించగా అనుమతులు మంజూరు చేశామని తెలిపారు.
ఖాళీ పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించాలి
శ్రీకాకుళం: ఆగస్టులో కొందరు ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేశారని, ఆయా పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడు పిసిని వసంతరావు, హెచ్ఎం పశువుల జగన్నాథరావు తదితరులు కోరారు. ఈ మేరకు డీఈఓ ఎ.రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. కొన్ని పాఠశాలల్లో 300 మంది విద్యార్థులున్నా ఒక్కరే సబ్జెక్టు టీచర్ ఉన్నారని, బోధించడం కష్టంగా మారిందన్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు బోధన కుంటుపడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


