పర్లాకిమిడి: జిల్లా శిశు సురక్షా సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో అనాథ బాలలు, శిశు సంక్షేమం కోసం జిల్లా అధికారులు వారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు అధ్యక్షత వహించారు. ఏడీఎం మునీంద్ర హానగ, సమగ్ర గిరిజనాభివృద్ధి, జిల్లా ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, బాలల అక్రమరవాణా నిరోధక అధికారి కమలా చౌదరి, తదితరులు హాజరయ్యారు. తొలుత జిల్లా శుశు సురక్షా సమితి అధికారి అరుణ్ కుమార త్రిపాఠి మాట్లాడారు. గజపతి జిల్లాలో పలు బాలల సంరక్షణ కేంద్రాల్లో నివసిస్తున్న వారికి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం తల్లులను పోగొట్టుకున్న పిల్లలు, చైల్డ్లైన్ కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లా కార్మిక శాఖ తరఫున అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రజుక్త శోబోరో గత ఆరు నెలలుగా అనాథ బాల లను సంరక్షించిన జాబితాను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఇప్పటివరకు గజపతి జిల్లా నుంచి వివిధ రాష్ట్రాలు దంపతులకు దత్తత నిమిత్తం అందజేసిన బాలలతో దృశ్యశ్రవణం ద్వారా వారితో అధికారులు మాట్లాడారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని అంగన్వాడీ కార్యకర్తలకు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఎన్జీఓలు, ఇతర శిశు సంరక్షణ కేంద్రాల కార్యకర్తలు పాల్గొన్నారు.


