పర్లాకిమిడి: స్థానిక ఆర్కే పాడి మార్గం రోడ్డులో ఉన్న రోడ్డు రవాణా కార్యాలయంలో శనివారం ఉదయం పదిగంటల సమయంలో మంటలు చెలరేగటంతో సిబ్బంది అగ్నిమాపక దళానికి ఫోన్ చేశారు. ఆర్టీఓ కార్యాలయంలో మంటలు వ్యాపించడంతో సంఘటన జరిగిన కొద్ది సమయంలోనే అగ్నిమాపక దళం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది మొదటి అంతస్తు భవనంలో మంటలు ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా లక్షలాది రూపాయల విలువైన కంప్యూటర్స్, ఫర్నీచర్, ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ సందర్భంగా ఎంవీఐ విలేకరులతో మాట్లాడుతూ, తొలుత బయోమెట్రిక్ గదిలో మంటలు ఏర్పడి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయని, విద్యుత్ షార్టు సర్క్యూట్ వల్లే ఆర్టీఓ కార్యాలయంలో మంటలు ఏర్పడినట్టు ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. ఫైర్ సేఫ్టీ లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.


