రాయగడ: లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు, ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు యాళ్ల వేంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణంతో పట్టణంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గురువారం అర్థరాత్రి ఎప్పటిలాగే స్తానిక రాణిగుడఫారంలోని ఆయన స్వగృహంలో భోజనం చేసిన అనంతరం ఒక్కసారిగా ఆపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కొసం తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం స్వగృహంలో ఉంచారు. శుక్రవారం నాడు ఆయన మరణ వార్త దావాణంలా వ్యాపించడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు, వివిధ రాజీకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
తెలుగు ప్రజల కోసం..
తెలుగు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్లుగా ఉత్కళ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు కొండబాబు ఘనంగా నిర్వహిస్తూ వచ్చారు. అందరికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలపై స్పందిస్తు తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో ఆయన బీజేడీలో క్రీయాశీలకంగా పనిచేశారు. రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ పార్టీ అధిష్టానంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కొండబాబు అకాల మరణానికి రాజకీయ, సామాజిక వర్గాలతో పాటు తెలుగు ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక, కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక, బీజేపీ నాయకులు కాలీరాం మాఝి, టుటుదాస్, ఎస్డీసీ చైర్మన్ సబర్, వైస్ చైర్మన్ మంజుల మినియాక, బీజేడీ సీనియర్ నాయకుడు సుధీర్ దాస్, పి.గౌరీశంకరరావు తదితర ప్రముఖులు కొండబాబు పార్థవ దేహాన్ని సందదర్శించి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ నడుమ మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.


