పర్లాకిమిడి: కాశీనగర్ సమితి కిడిగాం గ్రామంలో గృహిణి హడపా కుమారి (35) ఇంట్లోకి ప్రవేశించి, ఆమె చేతిని బలంగా లాగి, అత్యాచారానికి పాల్పడమే కాకుండా అడ్డువచ్చిన ఆమె అత్తను కూడా దుర్భాషలాడి, చంపుతానని పనస ధర్మారావు బెదిరించాడు. ఈ కేసులో గజపతి జిల్లా న్యాయస్థానం జిల్లా జడ్జి జగదీష్ ప్రసాద్ మహంతి కఠినంగా శిక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్లో ఆమెకు ఇష్టంలేకుండా, ఇలాంటి దారుణాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఆగస్టు 5వ తేదీ సాయంత్రం కిడిగాం గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళ హడపా కుమారిపై అత్యాచారం, దౌర్జన్యం చేసిన ఘటనలో నిందితుడు పనస ధార్మరావుపై కాశీనగర్ ఏఎస్ఐ మనోజ్కుమార్ పాడి కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ మనోజ్ కుమార్ పాడీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ కేసులో 8 మంది సాక్షులు, ఆరు ధ్రువీకరణ పత్రాలను న్యాయస్థానం ముందు పిటిషనర్ హడపా కుమారి ఉంచారు.
రాయగడ: జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన చంద్రపూర్ సమితి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అఽశుతోష్ కులకర్ణి అధ్యక్షతన సోమవారం వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలను అధికారులకు వినిపించారు. మొత్తం 37 వినతులను స్వీకరించిన అధికారులు వాటిలో 22 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. మరో 15 సామూహిక గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. స్వీకరించిన గ్రామ సమస్యలను సంబంధిత శాఖ అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ కులకర్ణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ రాజ్ప్రసాద్, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనీల్, జిల్లా ముఖ్య వైద్యాధికారి డాక్టర్ బిశ్వంబర్ బెహర, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అజయ్ కుమార్ ప్రధాన్ పాల్గొన్నారు.
పర్లాకిమిడి: మోహనా నియోజకవర్గం అడవ పోలీసు స్టేషన్ పరిధిలోని సర్పంచ్లు, వార్డు సభ్యులు, కమ్యూనిటీ లీడర్స్, ఆదివాసీలతో సోమవారం జిల్లా ఎస్పీ ప్రహ్లద్ సహాయ్ మీ నా అడవ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గంజాయిని పండి స్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిషాముక్త అభియాన్లో పాలుపంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ సంతోష్కుమార్ బిశోయి, ఆర్.ఉదయగిరి సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాజేష్ కుమార్ సాహు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయంలో పాము
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సుమారు 7 అడుగుల తాచుపాము కలకలం రేపింది. ఉదయం దాదాపుగా 11 గంటల సమయంలో ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్న గదిలో ఒక్కసారికి ప్రత్యక్షం కావడంతో ఉద్యోగులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. సిబ్బంది చాకచాక్యంగా పామును బయటకు పంపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్యాలయం చుట్టూ పిచ్చి మొక్కలు అల్లుకుపోవడంతో విష కీటకాల భయం తప్పడం లేదు.


