జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి మాల్దా గ్రామ సంరక్షిత అడవిని (రిజర్వ్ ఫారెస్ట్) పరిరక్షించాలని కమ్యూనిస్టు పార్టీ బొరిగుమ్మ శాఖ డిమాండ్ చేసింది. కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో ఆ గ్రామ ప్రజలు జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ముంగిట శనివారం ఆందోళన చేపట్టారు. కార్యాలయంలో సబ్ కలెక్టర్ జాదుమని నాయక్ లేకపోవటంతో ఐటీయూసీ కార్యదర్శి సబ్ కలెక్టర్కు ఫోనే చేశారు. ఆయన సూచన మేరకు రెవెన్యూ అధికారి వచ్చి వినతిపత్రం స్వీకరించారు. మాల్దా ప్రాంతంలో సంరక్షిత అడవులను దొంగిలించబడుతున్నాయని, వెంటనే వాటిని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండీలలో ధాన్యం అమ్మేందుకు రైతుల పేర్ల నమోదు చేయటంలో తారతమ్యాలు చూపుతున్నారని ఆరోపిస్తూ.. రైతులందరి పేర్లు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అన్నిటి కంటే మరో విచారకరమైన విషయం ఆ గ్రామంలో గల ఆదివాసీ స్వాతంత్య్ర యోధుడు షహిద్ లక్ష్మణ నాయక్ ప్రతిమను రాత్రికి రాత్రి పగుల గొట్టి ఎక్కడో దాచిపెట్టారని వెల్లడించారు. ఈ ఆందోళనకు కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహంతి, ఏఐటీయూసీ కొరాపుట్ అధ్యక్షుడు జుదిష్టర్ రౌళో, కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్, బొరిగుమ్మ ప్రాంతీయ కమిటీ కార్యదర్శి బైద్యనాథ్ టక్రీ, సభ్యులు అనిత నాయక్, లక్ష్మీ భొత్ర, డొంబురు భొత్ర, తదితరులు పాల్గొన్నారు.


