● కుల ధ్రువీకరణ పత్రం కోసం రూ.8 వేల లంచం డిమాండ్
జయపురం: కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేసేందుకు రూ.8 వేల లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ వలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చిక్కారు. కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం అధికారుల వివరణ ప్రకారం.. మల్కన్గిరి జిల్లా మల్కన్గిరి తహసీల్దార్ ఆదీనంలో గల ఝరపాళీ సర్కిల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సూరజ్ బాలా లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఒక వ్యక్తి నియమం ప్రకారం ఆయన భార్యకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కోసం ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకున్నారు. అందుకు అవసరమైన ఫీజు చెల్లించారు. ధ్రువీకరణం పత్రం ఇవ్వకుండా ఆర్ఐ జాప్యం చేశారు. దరఖాస్తుదారుడి నుంచి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. మొదట రూ.8 వేలు, పని అయిన తరువాత రూ.2 వేలు ఇవ్వాలని ఆర్ఐ అడిగారు. లంచం డిమాండ్తో దరకాస్తుదారుడు జయపురం విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దరకాస్తుదారుని ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు వల పన్నారు. మంగళవారం దరకాస్తుదారుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సూరజ్ బాలాకు అతని కార్యాలయంలో రూ.8 వేలు ఇస్తున్న సమయంలో పథకం ప్రకాకం విజిలెన్స్ అధికారులు దాడి చేసి అతని నుంచి రూ.8 వేలు సీజ్ చేశారు. అనంతరం సూరజ్కు చెందిన రెండు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ సంఘటనపై కొరాపుట్ విజిలెన్స్ జయపురం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. నిందితుడు సూరజ్ బాలాపై గతంలో కూడా లంచం తీసుకున్న కేసు ఉంది. 2023లో ఓ కేసులో హాజరు నోటీసు జారీ చేయటానికి రూ.15 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణ ఉంది. ఆ కేసు జయపురం విజిలెన్స్ కోర్టులో విచారణలో ఉంది.


