భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని వార్షిక యాత్ర కోసం రథం తయారీ పనుల్లో నిమగ్నమైన భోయ్ సేవకుల్లో ఒకరు మంగళ వారం గుండె పోటుతో మరణించడంతో రథ నిర్మాణ శాల ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు ధోబా భోయిగా గుర్తించారు. అతడు బలభద్రుని తాళ ధ్వజ రథం నిర్మాణంలో నిమగ్నమై ఉండగా ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యాడు. తోటి కార్మికుల సమాచారం ప్రకారం మంగళ వారం ఉదయం ధోబా భోయి ఛాతీ నొప్పితో బాధపడ్డాడు. సత్వర చికిత్స కోసం తొలుత అతడిని పూరీలోని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతడు మరణించినట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియడంతో పూరీ జిల్లా కలెక్టర్ రథ తయారీ శిబిరం సందర్శించారు. పరిస్థితిని సమీక్షించి సేవకుడి మరణంపై విచారం వ్యక్తం చేశారు. మృతుడు ధోబా బోయి కుటుంబానికి జిల్లా యంత్రాంగం అవసరమైన సహాయాన్ని అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.


