జయపురం: పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. మంగళవారం బొరిగుమ్మ పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమితి కార్యాలయం ఎదుట భైటాయించారు. పెట్రోలు, డీజల్, వంట గ్యాస్, నిత్యవసర ధరలు తగ్గించాలని, అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్రపతి పేరిట వినతిపత్రాన్ని బొరిగుమ్మ బీడీఓకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెన్షన్ ఎవరి దయా కాదని, ప్రజలకు వేసే భిక్షకాదని అన్నారు. ప్రజలు పొందే న్యాయపరమైన హక్కు అన్నారు. అది ఏ రాజకీయ నేత జేబు నుంచి తీసి ఇవ్వటం లేదని, అది ప్రజల డబ్బు అని అన్నారు. వారి డబ్బు వారికి ఇచ్చేందుకు పాలకులకు ఎందుకు కష్టమని దుయ్యబట్టారు. పెన్షన్ కోసం వృద్ధులు సైతం అధికారుల చుట్టూ తిరగడం పాలకులకు సిగ్గుగా లేదా అని నిలదీశారు. గత మూడు నేలలుగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు ఆగిపోవటం వలన ఆర్థికంగా సమస్యలు ఎదుర్కుంటున్నారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


