న్యూస్రీల్
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026
మహేంద్ర గిరి..
పర్లాకిమిడి: పవిత్ర పుణ్యక్షేత్రం మహేంద్రగిరి పీఠంలో గత ఎనిమిది రోజులుగా జరుగుతున్న మహేంద్రమేళాలో రాష్ట్ర గవర్నర్ హరిబాబు కంభంపాటి సోమవారం సతీసమేతంగా పాల్గొన్నారు. ఉదయం 9 గటలకు వచ్చిన గవర్నర్ మహా యజ్ఞంలో పాల్గొని ప్రధాన యజ్ఞకుండంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుంతీ మందిరం, గోకర్ణేశ్వర పీఠాన్ని దర్శించి పండితులు, వివిధ పీఠాధిపతుల ఆశీర్వాదం పొందారు. అనంతరం ఆయన మహేంద్రంలో ధార్మిక సభల్లో పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సాధు సంతవులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గంజాం జిల్లాకు చెందిన ప్రసిధ్ధ దోండ నృత్యం, మహేంద్రగిరి చరిత్రపై రుచించిన ‘ఋషిపుత్ర’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ బ్యాటరీ వాహనంలో మహేంద్రగిరిలో వివిధ యజ్ఞ వేదికలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి, రాష్ట్ర రవాణా, గనుల శాఖామంత్రి బిభూతీ భూషణ్ జెన్నా, జిల్లా కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్, జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా, డి.ఎఫ్.ఓ. కె.నాగరాజు, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. గవర్నరు హారిబాబు, రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి మహేంద్రం నుండి నేరుగా మోహానా దగ్గరలో జిరంగో వద్ద ఉన్న టిబెటియన్ బౌద్ధ మందిరాన్ని సందర్శించారు. గవర్నర్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. మరో వైపు మహేంద్రమేళాకు 50వేల మంది భక్తులు సోమవారం తరలి రావడంతో బుర్ఖాత్పాస్ నుంచి మహేంద్రం కొండ మీద వాహనాల పార్కింగ్ సమస్య తలెత్తింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండ మార్గాల గుండా నడుచుకుంటూ మహేంద్రగిరి శిఖరాన్ని చేరుకుని పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ భారీగా ఉన్నా మేళా ప్రాంగణంలో ప్రశాంతమైన, క్రమబద్ధమైన వాతావరణం కనబడింది. అందరిలో మహేంద్రంలో జరుగుతున్న యజ్ఞాలు, పూజలు చూడటానికి ఉత్సుకత కనిపించారు.


