కొరాపుట్: దివంగత భార్యకి మాజీ ఎంపీ నివాళులు అర్పించారు. సోమవారం ప్రతిపక్ష బీజేడీకి చెందిన నబరంగ్పూర్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి రమేష్ చంద్ర మజ్జి తన దివంగత భార్య తపసి మజ్జికి నివాళులు అర్పించారు. ఆమె 11వ వర్ధంతి సందర్భంగా తన నివాసంలో సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్ కుమారుడు, కుమార్తె, సోదరుడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ మజ్జి తదితరులు పాల్గొన్నారు. 11 ఏళ్ల క్రితం రమేష్ మంత్రి హోదాలో నియోజకవర్గంలో మారు మూల ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇదే సమయంలో భువనేశ్వర్లో తపసికి అనారోగ్యం సంభవించింది. ఈ విషయం తెలియక రమేష్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఆమె పరిస్థితి విషమించడంతో సిబ్బంది అప్రమత్తమై రమేష్కు సమాచారం ఇచ్చారు. సుదూరంగా ఉన్న రమేష్ రాక ఆలస్యమైంది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ యుద్ద ప్రాతిపదికన ప్రత్యేక విమానంతో తపసిని న్యూఢిల్లి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ తపసి తుది శాస విడిచారు.


