జయపురం: కొరాపుట్ జిల్లాల్లోని 12 గోదావరిష్ మిశ్రా ఆదర్శ పాఠశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి మోహన్ చంద్ర మఝి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితిలో బి.జానిగుడ ప్రభుత్వ నోడల్ ఉన్నత పాఠశాల, బి.సింగపూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నారిగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గోదావరిష్ ఆదర్శ ఉన్నత పాఠశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. బొరిగుమ్మ సమితిలో జరిగిన గోదావరిష్ ఆదర్శ పాఠశాలల శంకుస్థానలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆదర్శ పాఠశాలకు చిన్నారితో ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీిపతి శంకుస్థాపన చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యారంగంలో వెనుకబడిన ఈ ప్రాంతంలో విద్యా ప్రగతికి, విద్యార్థుల ఉజ్వల భవితకు ఆదర్శ పాఠశాలలు ఎంతో అవసరమన్నారు. గుణాత్మకమైన, విలువతో కూడిన విద్య అందించే దిశగా గోదావరిష్ ఆదర్శ పాఠశాలలు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా పరిషత్ నృశింహనాథ్ శతపతి, కార్యక్రమం నిర్వాహకులు అదనపు బ్లాక్ విద్యాధికారి అర్పిత ప్రధాన్, సర్పంచ్ టంకుదొర నాయక్, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు డానియల్ కులదీప్, పాఠశాల హెచ్ఎం జితేంద్ర ఖొడ పాల్గొన్నారు.


