శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ (పి.జి.ఆర్.ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి 168 వినతులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 69 అర్జీలు స్వీకరించారు. పంచాయతీరాజ్ శాఖకు 18, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు 14, సెర్ప్ విభాగానికి 13, విద్యుత్ శాఖకు 10 అర్జీలు అందాయి. వినతులన్నింటినీ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని రెగ్యులర్ ప్రాతిపదికన ప్రభుత్వం భర్తీ చేయాలని కోరుతూ వెటర్నరీ వైద్యులు సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ వెటర్నరీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్ అసోషియేషన్ ప్రతినిధులు డాక్టర్ మురళీ, డాక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.


