జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితి కుంధ్రాలో కొత్తగా పశుచికిత్సాలయం ప్రారంభోత్సవంలో కుంధ్ర గ్రామ పంచాయతీ సర్పంచ్ కనకలత పెంటియ, పంచాయతీ సమితి ఉపాధ్యక్షుడు రాధావినోద్ సామంతరాయ్లు తమ నిరసన వ్యక్తం చేశారు. కుంద్ర పశు చికిత్సాలయ ప్రారంభోత్సవానికి తమను ఆహ్వానించలేదని వారు నిరసన తెలిపారు. ఒక దశలో వారు నూతన పశువైద్యశాల సైన్ బోర్డును తొలగించి బద్దలు చేసేందుకు ఉద్యమించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర ఆగ్రహంతో వారిని అరెస్టు చేయమని పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రజా ప్రతినిధులు వారిని అడ్డగించి నచ్చ చెప్పారు. అయినా వారు తమను ఆహ్వానించనందుకు తీవ్ర ఆగ్రహం తెలిపారు. ఒక దశలో ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భోత్ర అనుచరులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పశు చికిత్సాధికారి మీధర బెహర కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవటం భావ్యం కాదని, అందుచేత పశుచికిత్సాలయ అధికారి బదిలీ చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అభిప్రాయ పడ్డారు. ఈ సమయంలో పోలీసులు వచ్చి సమస్యను సమాధానపరిచారు. అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి పశువైద్యశాలను ప్రారంభించారు.


