జయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి తారాభట్టాలో ధాన్యం మండీ ప్రారంభించనందుకు నిరసనగా తారాభట్టా మండీ ప్రాంత రైతులు ఆదివారం రాస్తారోఖో నిర్వహించారు. విషయం తెలిసిన అధికారులు, మిల్లు యజమానులు వచ్చి త్వరలోనే మండీ ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వటంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. ప్రభుత్వ అధికారుల నిర్ణయం ప్రకారం ఈ నెల 3 వ తేదీన రబీ ధాన్యం కొనేందుకు మండీలు ప్రారంభించాలి. అయితే ఇంతవరకు తమ ప్రాంతంలో మండీలు ప్రారంభించలేదని తారాభట్టా మండీ ప్రాంత రైతులు ఆరోపించారు. మండీలో ధాన్యం అమ్మేందుకు గత నెల 28 వ తేదీనే తమకు టోకెన్లు ఇచ్చారని రైతులు వెల్లడించారు. అందుచేత తాము మండీకి ధాన్యం తెచ్చామని నేడు వందల బస్తాల ధాన్యం మండీలో పడి ఉన్నాయని వెల్లడించారు. తమకు ఇచ్చిన టోకెన్ గడువు ముగిస్తే ధాన్యం కొనుగోలు చేయరని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండీ తెరని అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా నేడు మండీ పరిది రైతులు బొరిగుమ్మ సమితి బి.సింగపూర్ పోలీసు స్టేషన్ సమీపంతో రాస్తారోఖో ఆందోళన చేపట్టినట్లు రైతులు వెల్లడించారు. తమ ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆందోళన విరమించమని రైతులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్స్ మోనిక రాయ్, సివిల్ సప్లై అధకారి మానస రంజన్ మహాపాత్రో, బొరిగుమ్మ తహసీల్దార్ శోబన్ కుమార్ బెహర, బీడీఓ సుకాంత కుమార్ పట్నాయిక్, కమతా లేంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ మానసీ హొత తదితరులు వచ్చి ఆందోళన జరుపుతున్న రైతులతో కలిసి చర్చించారు. మండీలో ధాన్యం అమ్మేందుకు టోకెన్ కలిగి ఉండి సకాలంలో మండీ ప్రారంభించక పోవటం వల్ల తామ ధాన్యం అమ్ముకోలేక పోతున్నామని రైతులు అధికారుల మందు ఆవేదన వ్యక్తం చేశారు. మండీ త్వరలోనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు, మిల్లర్లు హామీ ఇచ్చిన తర్వాత రైతులు ఆందోళన విరమించారు.


