నరసన్నపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానుల సమస్యలు పరిష్కరించాలని లారీ ఓనర్స్ అసోషియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. నరసన్నపేటలోని విజయదుర్గా లారీ ఓనర్స్ అసోషియేషన్ కార్యాలయంలో న్యూ ఆంధ్రా లారీ, ట్రక్కర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేషగిరిరావు, జిల్లా లారీ ఓనర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు బి.జనార్దనరావు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. విపరీతంగా పన్నులు వేస్తున్నారని, స్పీడ్ లిమిట్ పేరిట జరిమానాలు విధిస్తున్నారని, జరిమానా ఏ రాష్ట్రంలో పడితే అక్కడి కోర్టుకే వెళ్లి కట్టాలని అంటున్నారని, వీటితో పాటు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లారీ ఓనర్స్ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో నరసన్నపేట లారీ ఓనర్స్, ట్రక్ సంఘం ప్రతినిధులు రావాడ భాస్కరరావు, ఊణ్ణ శ్రీధర్, పంచిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు.


